Off The Record: ఏపీ పాలిటిక్స్లో నెల్లూరు పెద్దారెడ్లంటే ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది. జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల మీద కూడా వాళ్ళ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటారు. అలాంటి చోట కీలక నేతల్లో ఒకరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఒకప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ చేసిన ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆదాల…. టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆదాల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్కు బ్రేకేశారు కోటంరెడ్డి. ఇక ఆ తర్వాతి నుంచి పూర్తిగా పొలిటికల్ మూగనోము పట్టారు మాజీ ఎంపీ. దీంతో ఆయన్ని నమ్ముుకుని బట్టలు చించుకున్నవాళ్ళను సైతం నట్టేట ముంచేశారంటూ… విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రభాకర్రెడ్డి అనుచరులు కొందరు పార్టీ రూరల్ ఇంచార్జ్ విజయ్ కుమార్ రెడ్డితో సర్దుకుపోలేక పొలిటికల్ జంక్షన్లో స్ట్రక్ అయిపోయారట. ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నప్పటికీ.. పార్టీ కార్యక్రమాలకి హాజరవడం లేదు. దీంతో తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న చర్చలు సైతం జరుగుతున్నాయి.
కాషాయ కండువా కప్పుకుంటారని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది.కానీ ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం, రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లాకు కూడా గెస్ట్ అయిపోయారట. వచ్చినప్పుడు కూడా కేవలం తన వర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలతోనే మాట్లాడేసి వెళ్ళిపోతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా ఆదాలను కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. జిల్లా రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న కాకాణి పనిగట్టుకుని మాజీ ఎంపీని కలవడంపై జిల్లా రాజకీయవర్గాల్లో గట్టి డిస్కషనే నడుస్తోంది. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జ్లు ఉన్నారు. కానీ…. నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి మాత్రం లేరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే….గోవర్ధన్రెడ్డి ఆదాలను కలిసి మళ్లీ యాక్టివ్ కావాలని కోరినట్టు తెలిసింది. సీనియర్ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తే బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారట కాకాణి. తనకు వేరే ఆలోచనలు లేవని, కానీ… యాక్టివ్ అవడానికి ఇంకొంత టైం పడుతుందని ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాజీ మంత్రికి చెప్పారట. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆదాలకు బంధుగణం, అనుచరగణం ఉన్నాయి. అందుకే ఆయన అనుభవాన్ని, బలాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంలో ఉందట వైసీపీ జిల్లా నాయకత్వం. అందులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాలతో భేటీ అయ్యారని సమాచారం.
వైసీపీలో ఉంటూనే… ఎన్నికల టైంకి ప్రభాకర్రెడ్డి యాక్టివ్ అవడంగాని, ఆయన కూతురు హిమబిందు పొలిటికల్ ఎంట్రీగాని ఉండవచ్చంటున్నారు. మాజీ ఎంపీ హోదాలో ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తే ఆయా నియోజకవర్గ ఇంచార్జులు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని.. అందుకే తాను రాజకీయ పర్యటనలకు దూరంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారట ఆదాల. కానీ… పార్టీ అధిష్టానం మాత్రం లోక్సభ నియోజకవర్గం విషయంలో ఆయన్నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వీరిద్దరి భేటీలో ఆదాల పార్టీలోనే ఉంటారన్న క్లారిటీ మాత్రం వచ్చిందని, ఇక ఎప్పటికి యాక్టివ్ అవుతారో చూడాలంటున్నాయి వైసీపీ వర్గాలు.
