OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..

Thumb

Thumb

పార్టీ పెద్దలేమో… వచ్చేది మన ప్రభుత్వమే అంటారు.. ఫీల్డ్‌లో నేతలేమో… అమావాస్యకో.. పున్నానికో తప్ప నియోజకవర్గాల్లో కనిపించరు. మండల స్థాయి నేతలకు కూడా దొరకనంత మెరుపు తీగలైపోయారు. అలాంటి వాళ్ళంతా సడన్‌గా ఎందుకు సీన్‌లోకి వచ్చారు? గాఢ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్టు ఎందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు? ఏ పార్టీ నాయకులు, ఎక్కడ అలా మారిపోయారు?

భారత రాష్ట్ర సమితికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెట్టని కోట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణ అంతటా గులాబీ వ్యతిరేకపవనాలు వీచినా… కరీంనగర్ జిల్లాలో మాత్రం ఐదు సీట్లు దక్కాయి. అలాంటి చోట పార్టీ అధికారం కోల్పోయాక నాయకులంతా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా మారిపోయారు. నియోజకవర్గ స్థాయిలో పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్‌లు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారట. కొందరైతే నెలకోసారో రెండు సార్లో వచ్చి మెరుపు తీగల్లా మాయమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు తమ వ్యాపారాలు, వ్యక్తిగత కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టారనే విమర్శలు సొంత క్యాడర్‌నుంచే వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో క్యాడర్‌ని కలవడం కంటే, హైదరాబాద్‌లో ఎక్కువ సమయం గడపడం, స్టేట్ లెవెల్ కార్యక్రమాలకు పరిమితం కావడం, అక్కడ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోవడం లాంటి వాటికే పరిమితం అవుతున్నారట.

పెద్ద నాయకుల దృష్టిలో, ముఖ్యంగా కేటీఆర్ దృష్టిలో పడితే సరిపోతుందన్నది ఆ బాపతు అభిప్రాయంగా తెలుస్తోంది. ఇలాంటి వాళ్ళలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నది పార్టీ వర్గాల మాట. అలా… తామరాకు మీద నీటిబొట్టులాగా అంటీ ముట్టనట్టుగా రెండున్నరేళ్ళపాటు టైంపాస్ చేసిన కార్ పార్టీ నేతలు… ఇప్పుడు హఠాత్తుగా క్షేత్ర స్థాయిలో హడావిడి చేస్తున్నారు. తమ నియోజవకర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నీటి కొరత, ఇసుక దందా.. ధాన్యం కొనుగోళ్లు ఇలా ఎక్కడ మైలేజ్ వస్తుందనుకుంటే అక్కడ వాలిపోతున్నారు. దీంతో… ఉన్నట్టుండి వీళ్ళకి ఏమైందబ్బా…? ఈ ఆకస్మిక మార్పునకు కారణాలేంటని గులాబీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయి. అయితే… ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీటింగే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీలు ఇతర ముఖ్య నాయకులతో హైదరాబాద్‌లోని మాజీ మంత్రి గంగుల ఇంట్లో ఓ సమావేశం నిర్వహించారట కేటీఆర్. ఎవరికీ ముందస్తుగా చెప్పకుండా కేవలం ఫలానా ప్లేస్‌కు రండని మెసేజ్ ఇచ్చారు. ఓటర్ సవరణ కార్యక్రమం పై సూచనలు చేస్తారేమోనని అనుకుంటూ అంతా అక్కడికి వెళ్లారట. తీరా … ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి… నేతల పనితీరు.. క్యాడర్‌కు లీడర్‌కు మధ్య గ్యాప్… ఇతర పార్టీల బలా బలాలు… తక్షణమే ఎన్నికలు వస్తే సదరు లీడర్‌గారి పొజిషన్ లాంటి అంశాలతో ఓ పూర్తి రిపోర్టును కేటీఆర్‌ వాళ్ళ ముందు ఉంచినట్టు తెలిసింది.

గత మూడు నెలల నుంచి గులాబీ బాస్ స్వయంగా కొన్ని సంస్థలతో పార్టీ పరిస్థితిపై ఆయా జిల్లాల్లో సర్వే నిర్వహించిన విషయాన్ని చల్లగా చెప్పేశారట వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఉమ్మడి జిల్లాలోని కొందరు మాజీ ఎమ్మెల్యేల పనితీరు అత్యంత అధ్వాన్నంగా ఉందని మొహం మీదే చెప్పేసినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యేలకు కూడా యావరేజ్ మార్కులే పడ్డట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే అయితే మూడో స్థానానికి వెళ్లిపోయారట. మరికొందరు బార్డర్ లైన్లో ఉన్నారని, ఇంకొందరు రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయారని చెప్పడంతో అంతా అలర్టయినట్టు సమాచారం. ఇప్పటికైనా సర్దుకోకపోతే.. ప్రత్యామ్నాయం చూడాల్సి వస్తుందని కేటీఆర్‌ ఒకింత ఘాటుగా చెప్పడంతో అంతా ఫీల్డ్‌కు బయలు దేరినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజాసమస్యలపై ప్రెస్‌మీట్లు కాదు, పోరాటాలకు ప్లాన్ చేసుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారట కేటీఆర్. అందుకు తగ్గట్టే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన నియోజవర్గ రైతులకు సాగునీరు అందించాలంటూ తాజాగా పోరాటం ప్రారంభించారు. లోయర్ మానేరు డ్యాంలో సమస్యని ఎత్తిచూపేందుకు వినూత్న నిరసన తెలుపారాయన.

ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద నీళ్ల కోసం రైతులతో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇక చొప్పదండి నియోజవర్గంలోనూ యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేశారు. మానకొండూర్ నియోజవర్గంలో ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారంటూ రీచ్‌కు వెళ్లి పరిశిలించారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఆ రకంగా ఇకపై ప్రజల్లోఉంటూ నిరసనలు, ఆందోళనలను క్షేత్రస్థాయిలో మరింత పెంచే యోచనలో ఉన్నారట జిల్లా నాయకులు. రాబోయే రోజుల్లో సాగునీటి విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకతను చెప్పి రైతులను సంఘటితంచేసేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోందంటున్నారు. అయితే వీళ్ళంతా కేటీఆర్ క్లాస్ పీకడంతో కదిలారా…? లేదంటే సర్వేల్లో వచ్చిన రిపోర్టు చూసి అలర్టయ్యారా…? అనే అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. కారణం ఏదైనాగానీ…. ఈ యాక్టివిటీతో కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే ఇది కేవలం తాత్కాలిక మార్పా? లేదా నిజంగా ప్రజల సమస్యలపై దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతున్నారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.