Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన పాత కార్యకర్తలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు మధ్య ఆధిపత్య పోరు అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ పరిస్థితి పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళానికి దారితీస్తోందట. ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరాక నియోజకవర్గంలో పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు భీమ్ భరత్. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారాయన. ఇప్పుడు ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ ఒకే పార్టీలో ఉన్నా… కలిసి పని చేసే పరిస్థితి కనిపించడం లేదట.
ఇటీవల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించింది. మొత్తం ఐదు ఉండగా… రెండు చోట్ల తన అనుచరులకు పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే యాదయ్య. ఈ నియామకాలపై భీమ్ భరత్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ జెండా పట్టుకుని తిరిగిన తమను కాదని ఎమ్మెల్యే వేరే వారిని ఎలా నియమిస్తారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా… ఏకంగా గాంధీభవన్కే వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్ మెట్ల మీద ఎమ్మెల్యే యాదయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీన్ని బట్టే నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో నడుస్తోందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. నవాబ్పేట మండలంలో తన వర్గానికి చెందిన రావుగారి వెంకట్రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా సిఫారసు చేశారు యాదయ్య. అప్పటికే ఆ పదవిలో ఉన్న సామ వెంకట్రెడ్డి స్థానంలో రావుగారి వెంకట్రెడ్డి పేరును పీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో, సామ వర్గం మద్దతుదారులు ఆగ్రహించి గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ యాదయ్య జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కాలే…. అన్ని పదవుల్ని బీఆర్ఎస్ నేతలకే ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు పాత నేతలు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా, స్థానిక క్యాడర్ అసంతృప్తితో రగిలి పోతోందంటున్నారు. ఇది కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసిందని జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే యాదయ్యకు నిరసనలు కొత్తేమీ కాదని, వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని అంటోంది ఆయన వర్గం. కొన్ని సందర్భాల్లో కాలే మీద గుడ్లు, టమాటాలు విసిరి గో బ్యాక్ అంటూ కొందరు నినాదాలు చేసిన సంగతి కూడా గుర్తు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై గ్రామస్థులు దాడి చేసినంత పని చేశారు. పోలీసులు యాదయ్యను అక్కడి నుంచి పంపించి వేయడంతో ప్రజలు శాంతించారు. పార్టీలో అంతర్గత పోరు కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని, దీనివల్ల క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయానికి గురవుతోందని అంటున్నారు. ఇలాగే వదిలేస్తే…. రేపు పరిషత్ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలపై దీని ప్రతికూల ప్రభావం ఉంటుందన్న ఆందోళన కేడర్లో వ్యక్తం అవుతోంది.

