OTR : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్….. తాను ఎంపీగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ తీరుపై చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో బేతపూడి రాజేంద్ర, జగదీష్, మాణిక్యరావు.. ఇలా చాలా మంది ఆయన ముఖ్య అనుచరులుగా ఉండేవారు. అందులో జగదీష్ అయితే…. నందిగం సురేష్కు వరుసకు అల్లుడు అవుతాడు. అతని పెళ్ళి కూడా మాజీ ఎంపీ దంపతులే దగ్గరుండి చేయగా…. అప్పట్లో సీఎం హోదాలో జగన్ కూడా అటెండ్ అయ్యారు. అలా…. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అంతా కలిసే ఉన్నారు. కట్ చేస్తే… ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎవరికి ఎవరు, చివరికి ఎవరన్నట్టుగా మారిపోయింది వ్యవహారం.
READ ALSO: OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అందరిలో మార్పు వచ్చిందట. తనపై నమోదైన కేసులతో నందిగం జైలుకు వెళ్ళినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవర్ ఉన్నప్పుడు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముగ్గురూ ఒక్కసారిగా శత్రువులు అయిపోయారట. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తూ… నేను ఎంపీగా ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగి పనులు చేయించుకున్నవాళ్లు, నా వల్ల లబ్దిపొందినవాళ్లంతా నిలువునా మోసం చేశారంటూ సురేష్ వాపోయినట్టు తెలిసింది. నన్ను అడ్డం పెట్టుకుని ఎన్నో సెటిల్మెంట్లు చేశారు. నా పేరు వాడుకుని ఆస్తులు సంపాదించి చెడ్డపేరు తెచ్చారంటూ తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే…. ఉన్నట్టుండి నందిగం సురేష్, బేతపూడి రాజేంద్రల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. నందిగం సురేష్ నలుగురు మనుషులను పెట్టి మరీ… తనపై సోషల్ మీడియాలో అసభ్యంగా ఆరోపణలు చేయిస్తున్నారంటూ పోస్టింగ్స్ పెట్టారు బేతపూడి. అందుకు నందిగం అనుచరులనుంచి కౌంటర్ రావడంతో… స్వయంగా రాజేంద్ర రంగంలోకి దిగి హీటెక్కించారు. మీరు ఎంపీగా ఉన్నప్పుడు కొందరి మీద అక్రమ కేసులు పెట్టించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అలాగే కొందరికి పదవులు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్న సంగతేంటంటూ… అస్త్రాలు సంధించడంతో… మేటర్ ముదిరిపోయింది. మూడు రాజధానుల పేరుతో ఎంత డబ్బు నొక్కేశారో అందరికీ తెలుసంటూ ఏకిపారేశాడు రాజేంద్ర. అసాగే… అప్పటి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని ఎలా ఇబ్బందులు పెట్టావో కూడా చూశామన్నారు. అలాగే…. ఆలూరి అంబేద్కర్ ఎలా చనిపోయాడో చెప్పాలని సవాల్ విసిరారాయన.
నందిగం సురేష్ జాతకం మొత్తం మా దగ్గర ఉందంటూ రాజేంద్ర, జగదీష్ హెచ్చరించడం సెగలు పుట్టిస్తోంది. జైల్లో ఉన్నప్పుడు తనను బయటకు తీసుకురావడానికి సహకరించాలంటూ బంధువులను టీడీపీ నేత వర్ల రామయ్య వద్దకు పంపించింది ఎవరని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మాజీ ఎంపీ మాజీ అనుచరులు. బాపట్ల ఎంపీ సెగ్మెంట్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూపులో కూడా నందిగం సురేష్ అనుచరులకు, మరికొంతమందికి మధ్య ఇదే చర్చ నడుస్తోంది. నందిగం సురేష్కు తాను ఆర్దికసాయం చేశానని, ఆ డబ్బులు అడుగుతుంటే తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోస్తున్నారు జగదీష్. సురేష్ దంపతులవల్ల తనకు ప్రాణాహాని ఉందని బహిరంగలేఖ రాసి సెల్పీ వీడియో కూడా విడుదల చేశారాయన. విబేధాలు వచ్చి ఆయనతో దూరంగా ఉంటే….. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాజీ ఎంపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించడం సంచలనంగా మారింది. తనకు ఏదైనా జరిగితే దానికి నందిగం సురేష్ దంపతులే కారణమని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో… ఏం జరుగుతుందోనని అమరావతి వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
READ ALSO: Off The Record: ట్రెండ్ మార్చిన ఎమ్మెల్యే.. కాకినాడ పోలీసులకు వింత కష్టం
