సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం వద్దకు వెళ్లిన రైతు విద్యుత్ వైర్లు కాళ్లకు తగిలి మృతిచెందాడు. పుల్కాల్ (మం) మీన్ పూర్ తండాలో రెండ్రోజుల క్రితం గాలి దూమరానికి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఇది గమనించిన రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కరెంట్ కట్ చేశాం..త్వరలోనే వైర్ పునరుద్దరిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు అధికారులు. కరెంట్ కట్ చేశామని అధికారులే చెప్పడంతో నిన్న రాత్రి పొలం వద్దకు వెళ్లాడు రైతు రమేష్(33).
Also Read:Cyber Crime: జాదుగాళ్లు.. మెడికల్ కాలేజ్ డైరెక్టర్ పేరుతో.. ఆడిటర్ నుంచి కోట్లు నొక్కేశారు..!
ఈ సమయంలో తెగిపడ్డ వైర్ రమేశ్ కాళ్లకు తగిలింది. తెగిపడ్డ వైర్ కి కరెంట్ సరఫరా కావడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.