రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైసీపీ సిద్ధమైంది. ‘యువత పోరు’ పేరుతో ధర్నా కార్యక్రమంను నేడు వైసీపీ చేపట్టనుంది. ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు నాయకులు, కార్యకర్తలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసాలపై విద్యార్థులు, నిరుద్యోగులు నినదించనున్నారు. అంతేకాదు ధర్నాలు నిర్వహించనున్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువతతో కలిసి వైసీపీ పోరుబాకు సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి సన్నద్ధం అయింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు 4,600 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయనున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సింది రూ.7,100 బడ్జెట్లో కేటాయింపులు 2,600 కోట్లే అని వైసీపీ అంటోంది. తన హయాంలో 18,663.44 కోట్లు ఇచ్చానని వైఎస్ జగన్ అంటున్నారు. 16,347 పోస్టులతో డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసినా.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ హామీ 9 నెలలు గడుస్తున్నా వెలువడలేదని ‘యువత పోరు’లో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వంను ఎండగట్టడానికి సిద్దమయ్యారు.
వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేసింది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను కూడా చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మూడు త్రైమాసికాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం యువతను మోసం చేసింది. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. వీటన్నింటిపై ‘యువత పోరు’ జరగనుంది.