పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తిరుగులేని శక్తిగా వెలుగొందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, పార్టీ లోపల అసమ్మతి సెగలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దశాబ్దన్నర కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన మమతకు, ఈ ఓటమి ఒక రాజకీయ భూకంపం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి దీదీ వ్యూహాత్మక సమావేశాలను నిర్వహిస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేల గైర్హాజరు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పార్టీ భేటీకి ఎమ్మెల్యేల డుమ్మా..
తాజాగా మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి వ్యూహాత్మక భేటీకి 9 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 70 మంది మాత్రమే హాజరు కాగా, మిగిలిన వారు ఎందుకు రాలేదనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత కలహాలు ముదిరిపోయాయని, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే వార్తలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా బీజేపీ భారీ మెజారిటీతో (207 సీట్లు) విజయం సాధించడంతో, టీఎంసీలోని అసమ్మతి నేతలు ‘ఫిరాయింపుల’ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
రాజకీయ సంక్షోభం..
ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్న మమతా బెనర్జీ, తన రాజీనామాకు నో చెబుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఇది ప్రజా తీర్పు కాదని, ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే.. తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం ఆమె ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆమె సలహాదారు పదవులకు రాజీనామా చేయడం కూడా పార్టీ పతనాన్ని సూచిస్తోంది.
ఓటమి భారంతో ఉన్న పార్టీని ఏకతాటిపైకి తీసుకురావాల్సిన సమయంలో, ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకపోవడం ఫిరాయింపుల టెన్షన్ను పెంచుతోంది. ఒకవేళ ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీలోకి వెళ్లినా లేదా స్వతంత్ర గ్రూపుగా ఏర్పడినా, టీఎంసీ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత శకం ముగిసిందా లేదా అన్నది ఇప్పుడు కేవలం ఆమె పార్టీని ఎలా కాపాడుకుంటుంది అనే దానిపైనే ఆధారపడి ఉంది.
