NTV Telugu Site icon

UPSC: సివిల్స్-2022 తుది ఫలితాలు విడుదల

Upsc

Upsc

UPSC: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌-2022 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది. 933 మందిలో ఐఏఎస్ సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే ఐఎఫ్‌ఎస్‌కు 38 మందిని, ఐపీఎస్‌కు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-ఏకు 473 మందిని, గ్రూప్‌-బీకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్‌-బీ కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. జనరల్‌ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, ఓబీసీ కేటగిరీ కింద 263 మందిని, ఎస్సీ కేటగిరీ కింద 154 మందిని, ఎస్టీ వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది.

పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – upsc.gov.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా మహిళలే టాప్‌లో నిలిచారు. ఫలితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానం, స్మృతి మిశ్రా నాలుగో స్థానం, మయూర్ హజారికా ఐదో స్థానం దక్కించుకున్నారు. గత సంవత్సరం, శ్రుతి శర్మ తుది ఫలితంలో ఆల్ ఇండియా ర్యాంక్ 1ని సాధించింది. మొదటి మూడు స్థానాలను బాలికలే దక్కించుకున్నారు. అంకితా అగర్వాల్ ర్యాంక్‌ 2, చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లా 3 ర్యాంక్ సాధించారు. ఇదిలా ఉండగా.. యూపీఎస్సీ మే 28న సివిల్స్ సర్వీసెస్‌ పరీక్ష- 2023 ప్రిలిమ్స్‌ను నిర్వహించనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడ్డాయి.

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించారు. పవన్ దత్త- ర్యాంక్‌ 22, హెచ్ఎస్ భావన – ర్యాంక్‌ 55, అరుణవ్ మిశ్రా-56, సాయి ప్రణవ్-60, నిధి పాయ్- 110, రుహాని- 159 తో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకులను సాధించారు.

రిజల్ట్‌ లింక్ ఇదే-  క్లిక్ చేయండి