UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?

Upi Mdr Revenue

Upi Mdr Revenue

UPI MDR Revenue: ఇప్పుడు దేశవ్యాప్తంగా UPI లావాదేవీలపై MDR గురించే చర్చ సాగుతోంది.. దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐకి సంబంధించి కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో రూ.2,000 వరకు జరిగే అర్హత కలిగిన యూపీఐ వ్యాపారి లావాదేవీలకు MDR ఉండదు. అయితే రూ.2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M) లావాదేవీలపై 0.4 శాతం MDR విధించే విధానం తీసుకొచ్చారు. ఈ MDR ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా వినియోగించాలనే అంశంపై కూడా ప్రభుత్వం, NPCI కీలక ప్రకటన చేశాయి..

వచ్చే నెల 15 నుంచి కొత్త MDR విధానం
కేంద్ర ప్రభుత్వం Payment and Settlement Systems (PSS) Act, 2007లో సవరణలు చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14, 2026న నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సెప్టెంబర్ 15న దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను విడుదల చేసింది. కొత్త విధానం ప్రకారం అన్ని UPI లావాదేవీలపై ఒకే రకమైన MDR ఉండదు. లావాదేవీలను వివిధ కేటగిరీలుగా విభజించి, వాటి స్వభావాన్ని బట్టి MDR లేదా మినహాయింపులను నిర్ణయించారు. కొన్ని కేటగిరీలకు ఫ్లాట్-రేట్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టారు. సాధారణ చిన్న మొత్తాల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా రూ.2,000 వరకు అర్హత కలిగిన మర్చంట్ UPI లావాదేవీలకు MDR మినహాయింపు ఉంటుంది. రూ.2,000 దాటిన ఎంపిక చేసిన P2M లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. గతంలో మాదిరిగానే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P లావాదేవీలను ఈ మర్చంట్ MDR విధానంతో కలపకూడదు.

MDR ద్వారా వచ్చే ఆదాయంలో 5 శాతం ప్రత్యేక నిధికి
ఈ కొత్త విధానంలో కీలకమైన అంశం MDR ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఒకే చోట వినియోగించకుండా, దానిలో కొంత భాగాన్ని ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. NPCI సర్క్యులర్ ప్రకారం, మొత్తం MDRలో 5 శాతం భాగాన్ని ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. UPI వ్యవస్థను కేవలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడకుండా క్రమంగా స్వయం సమృద్ధిగా మార్చడం ఈ నిధి ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు ఊతం
ఈ ప్రత్యేక నిధిలోని డబ్బును ప్రధానంగా దేశంలోని టైర్-3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో UPI వినియోగం పెరగడంతో పాటు చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు..

చిన్న వ్యాపారులకు UPI మరింత అందుబాటులోకి.. సెక్యూరిటీపై ఫోకస్‌..
దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి మరింతగా రావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై కూడా ఈ నిధులను ఉపయోగించనున్నారు. దీని ద్వారా UPI ఆమోదం పెరగడంతో పాటు డిజిటల్ చెల్లింపుల పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అంటే MDR ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగం మళ్లీ డిజిటల్ పేమెంట్ వ్యవస్థ అభివృద్ధికే వెళ్తుందన్నమాట. అంతేకాదు.. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల నివారణ కూడా కీలకంగా మారింది. అందుకే MDR ఆధారిత నిధులను భద్రతా వ్యవస్థలు, సర్వర్ సామర్థ్యం, సైబర్ ఫ్రాడ్ నిరోధక మౌలిక సదుపాయాల మెరుగుదలకు కూడా వినియోగించనున్నారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు తమ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను మరింత భద్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఇందులో భాగంగా ఉంటుంది.

ఫోన్‌పే సీఈవో స్పందన ఇది..
UPI MDR విధానంపై PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ కూడా స్పందించారు. రూ.2,000కు మించిన వ్యాపారి UPI లావాదేవీలపై 0.4 శాతం MDR విధించడం ద్వారా పేమెంట్ పరిశ్రమకు ఆదాయ వనరు ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆదాయాన్ని మళ్లీ UPI ఎకోసిస్టమ్ అభివృద్ధి, విస్తరణలో పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. MDR ద్వారా ఏర్పడే అదనపు ఆదాయం డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాల విస్తరణకు ఉపయోగపడుతుందనే అభిప్రాయన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు..

దేశంలో పెరుగుతున్న UPI లావాదేవీలు
దేశంలో UPI వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో తాజా గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. ఆగస్టు 2026లో నెలవారీ UPI లావాదేవీలు 24.51 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ సుమారు రూ.29.82 లక్షల కోట్లుగా నమోదైంది. UPI వినియోగం ఇంత భారీ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో, చెల్లింపు వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వర్లు, భద్రతా వ్యవస్థలు, గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీపై పెట్టుబడుల అవసరం కూడా పెరుగుతోంది. మొత్తంగా కొత్త UPI MDR విధానం కేవలం వ్యాపారి లావాదేవీలపై ఛార్జీ విధించడానికే పరిమితం కాకుండా, డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌కు దీర్ఘకాలిక నిధుల వ్యవస్థను రూపొందించే దిశగా తీసుకున్న చర్యగా ప్రభుత్వం వివరిస్తోంది. రూ.2,000 వరకు లావాదేవీలకు MDR మినహాయింపు కొనసాగుతుండగా, ఎంపిక చేసిన రూ.2,000కు పైబడిన P2M లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. అందులో 5 శాతం ప్రత్యేక నిధికి వెళ్లి గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలు, చిన్న వ్యాపారుల UPI స్వీకరణ, సైబర్ భద్రత వంటి రంగాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు.