Ujjaini Mahankali Rangam: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పరిణామాలు తప్పవు’.. రంగం కార్యక్రమంలో ఆసక్తికర భవిష్యవాణి..!

  • ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సంప్రదాయ రంగం కార్యక్రమం
  • రంగం కార్యక్రమంలో భవిష్యవాణి
  • విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కావడంపై అసంతృప్తి..
Mahnkali

Mahnkali

Ujjaini Mahankali Rangam: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన సంప్రదాయ రంగం కార్యక్రమంలో అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆమె భావోద్వేగంతో పాటు ఆగ్రహ స్వరంతో మాట్లాడారు. తనకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కావడమే తన ఆగ్రహానికి కారణమని పేర్కొన్నారు.

భవిష్యవాణిలో ఆమె మాట్లాడుతూ.. “నేను సంతోషంగా రాలేదు.. ఆగ్రహంతో వచ్చాను. రెండు సంవత్సరాలుగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నా, ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. అయినా మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను కాపాడుతున్నాను. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు” అని అన్నారు.

అలాగే, ఈ ఏడాది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదలతో పాటు అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయని, వాటి వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. పాడిపంటలు బాగుంటాయని కూడా అన్నారు. మరోవైపు ప్రజల ప్రవర్తనపై కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. లేకపోతే ప్రాణనష్టాలు కొనసాగుతూనే ఉంటాయి” అంటూ హెచ్చరించారు.

తన విగ్రహ ప్రతిష్ఠను మరో ఆరు నెలల్లో పూర్తి చేయాలని, అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె భవిష్యవాణిలో పేర్కొన్నారు. “నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే మీరు కోరినవన్నీ నెరవేరుస్తాను. నాకు చేయాల్సినది చేస్తే మీకు మేలు జరుగుతుంది” అని అన్నారు. భవిష్యవాణి అనంతరం రంగం కార్యక్రమం ముగిసింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు.

గమనిక: రంగం కార్యక్రమంలో చెప్పిన భవిష్యవాణులు ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి. వీటికి స్వతంత్ర శాస్త్రీయ ఆధారాలు లేవు.