Ujjain: ఉజ్జయినిలోని సింహస్థ 2028 కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం చోటుచేసుకుంది. కంఠాల్ నుంచి ఛత్రీ చౌక్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న సుమారు 170 ఏళ్లనాటి హనుమంతుడి విగ్రహాన్ని (ఖడే హనుమాన్) వేరొక ప్రాంతానికి తరలించేందుకు జిల్లా యంత్రాంగం, ఇంజనీర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే ఇండోర్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన నిపుణులు, అత్యధునిక సాంకేతికతను ఉపయోగించినప్పటికీ, గడిచిన రెండు రోజులుగా ఆ ప్రతిమ అంగుళం కూడా పక్కకు కదల్లేదు. ఈ ఘటనతో ఇంజనీరింగ్ సాంకేతికత ఓడిపోయిందని, ఇది కేవలం దైవ శక్తి మహిమ మాత్రమేనని స్థానిక ప్రజలు, భక్తులు గట్టిగా నమ్ముతున్నారు.
మరో రెండు రోజుల్లో ఇదే మార్గం గుండా శ్రీ మహాకాళేశ్వరుడి రాజసవారీ (రాజసీ సవారీ) సాగాల్సి ఉంది. సమయం చాలా తక్కువగా ఉండటంతో యంత్రాంగంపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ప్రతిమ కదలకుండా ఉండటంతో ప్రస్తుతానికి అక్కడ భద్రత కోసం టెంట్ వేశారు. దీంతో అక్కడ వాతావరణం భక్తిమయంగా మారింది. మరోవైపు ఆలయ కాంపౌండ్ వాల్ను అధికారులు ఇప్పటికే కూల్చివేయడం పట్ల స్థానిక ప్రజలు, హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రోజున వందలాది మంది కార్యకర్తలు, భక్తులు గుమిగూడి ఆలయం వద్ద అత్యంత వైభవంగా మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం రెండు వైపులా ఇప్పటికే దారి ఉన్నప్పుడు, ఈ నిర్మాణంపై అధికారులు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆలయ పూజారి సులభ్ శాంతను శర్మతో పాటు కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టాంకీ చౌక్ వద్ద ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రతిమను సురక్షితంగా పునఃప్రతిష్ఠిస్తామని అధికారులు ముందుగా లిఖితపూర్వక హామీ ఇస్తేనే ముట్టుకోనిస్తామని, లేకపోతే సహించేది లేదని పూజారి స్పష్టం చేశారు.
పరిస్థితి సున్నితత్వాన్ని గ్రహించిన యంత్రాంగం ప్రస్తుతం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావించింది. ప్రతిమను పూర్తి గౌరవం, సురక్షితమైన పద్ధతిలోనే టాంకీ చౌక్కు తరలించాలనేది తమ ఆలోచన అని తహసీల్దార్ షెఫాలీ జైన్ వెల్లడించారు. ఇప్పటికే విగ్రహం పునాది స్థితిని పరిశీలించేందుకు 1.5 అడుగుల మేర గుంత తవ్వారు. తదుపరి చర్యల కోసం పురావస్తు శాఖ (ఆర్కియాలజీ) నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. వారు అత్యాధునిక యంత్రాల సాయంతో ప్రతిమ పునాది, లోపలి నిర్మాణం మరియు దాని చుట్టూ ఉన్న నేల స్వభావాన్ని స్కానింగ్ చేస్తున్నారు. ఆ స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే తదుపరి ఏ సాంకేతికతను ఉపయోగించాలనే దానిపై అధికారులు ఒక నిర్ణయానికి రానున్నారు.

