తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది 3 విడతల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచి ఈ నెల 29 వరకు ఆన్లైన్ కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధృవపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 23 నుంచి 30 వరకు ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. మొదటి విడత కోసం ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది విద్యాశాఖ.
ఈనెల 23 నుంచి 30 వరకు ధృవపత్రాల పరిశీలన అనంతరం 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. అయితే.. కళాశాలల పేర్లు.. కోడ్లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే మంచి కళాశాలకు బదులు నాసి కళాశాలలో సీటు వచ్చే ప్రమాదం ఉంది. విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్లోనే కళాశాలలు, వాటి ఎంసెట్ కోడ్లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్లను వెబ్సైట్లో ఉన్న మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని సూచిస్తున్నారు అధికారులు.
