అమెరికా, ఇరాన్ మధ్య గత మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా అమెరికా , ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ గొడవలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
చర్చలు జరుగుతున్న తీరును బట్టి.. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాల వంటి కీలక ప్రాంతాలపై దాడులు చేయవద్దని ట్రంప్ తన రక్షణ శాఖను ఆదేశించారు. ప్రస్తుతానికి ఐదు రోజుల పాటు ఈ దాడులను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. ఈ ఐదు రోజుల్లో జరిగే చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
