Today (13-03-23) Business Headlines:
దేశంలో తొలి స్టోర్ హైదరాబాద్లో
చిన్న పిల్లల ఆట బొమ్మల సంస్థ టాయ్స్ ఆర్ ఆజ్.. ఇండియాలో తొలి స్టోర్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ఏస్ టర్టిల్ అనే ఇ-రిటైల్ కంపెనీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విక్రయ కేంద్రంలో అన్ని బ్రాండ్ల బొమ్మలూ దొరుకుతాయని కంపెనీ తెలిపింది. భారతదేశంలో బొమ్మల పరిశ్రమ టర్నోవర్ వచ్చే ఏడాది నాటికి రెండు బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాయ్స్ ఆర్ ఆజ్ మరిన్ని స్టోర్లను ప్రారంభించనుంది.
వడ్డీ రేట్ల పెంపుపై ఆలోచించాలి
వడ్డీ రేట్లు పెంచే విషయంలో ఆర్బీఐ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను వేగవంతం చేస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశం మాదిరిగా ఇండియాలో వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని, అందుకే ఆ ప్రయత్నాలను నిలిపేసి ముందుకు వెళ్లాలని పేర్కొంది. భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో SBI గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ ఇలా స్పందించారు.
బీమా సంస్థలకు మరింత ఫండ్
దేశంలోని మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా మూలధనం ఇవ్వనుంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలకు గత ఏడాది 5 వేల కోట్ల రూపాయల క్యాపిటల్ ఫండ్ ఇచ్చింది. అయినప్పటికీ వాటి ఆర్థిక పరిస్థితి ఏమంత బాగలేదని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. దీనికోసం బడ్జెట్లో కేటాయింపులు జరపకపోయినప్పటికీ సప్లిమెంటరీ డిమాండ్ మేరకు ఇచ్చే వెసులుబాటు ఉందని చెప్పాయి.
సౌదీలో కొత్త విమానయాన సంస్థ
రియాద్ ఎయిర్ పేరుతో కొత్తగా జాతీయ విమానయాన సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దేశం భౌగోళికంగా ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల మధ్యలో ఉండటంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ఎయిర్పోర్టులకు విమానాలను నడపొచ్చని భావిస్తోంది. తద్వారా నాన్-ఆయిల్ జీడీపీ గ్రోత్ సాధించాలని ఆశిస్తోంది. 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకోవటమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చెన్నైలో బిర్యానీ ఏటీఎం లాంఛ్
మన దేశంలో తొలిసారిగా బిర్యానీ ఏటీఎం చెన్నైలో ప్రారంభమైంది. సిటీలోని కొలాతూర్ ఏరియాలో ఇది అందుబాటులోకి వచ్చింది. బాయ్ వీటు కళ్యాణం.. బీవీకే అనే సంస్థ దీన్ని లాంఛ్ చేసింది. ఔట్లెట్లో 32 అంగుళాల స్క్రీన్లు ఉంటాయి. వాటి మీద మెనూ బ్రౌజ్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు. కార్డుల ద్వారా గానీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి గానీ పేమెంట్లు చేయొచ్చు. చెల్లింపు పూర్తయిన కొద్ది నిమిషాల్లోనే ఫ్రెష్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ డెలివరీ అవుతుంది. బిర్యానీకి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాటుచేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సూలా సీఎఫ్ఓ బిట్టూ వర్గస్ రిజైన్
తమ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బిట్టూ వర్గీస్ రాజీనామా చేసినట్లు సూలా వైన్యార్డ్స్ లిమిటెడ్ తెలిపింది. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకున్నారని స్పష్టం చేసింది. బిట్టూ వర్గీస్ ఈ నెల 10వ తేదీన రాజీనామా చేసినట్లు 11వ తేదీన ఎక్స్ఛేంజ్కి తెలియజేసింది. ఆయనను జూన్ 9వ తేదీన రిలీవ్ చేస్తామని పేర్కొంది. దేశంలోని అతిపెద్ద వైన్ తయారీ సంస్థల్లో ఒకటైన సూలా వైన్యార్డ్స్ ఇటీవలే IPOని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు నాసిక్లో ఉన్న ఎస్టేట్కి ఏటా 3 లక్షల మందికి పైగా విజిటర్లు వస్తుంటారు.
