Viral Video: ఫుట్‌బాల్ మ్యాచ్ ఓడినందుకు.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్!

  • ఫుట్‌బాల్ మ్యాచ్‌లోఓటమి
  • కోపోద్రిక్తుడైన పీఈటీ టీచర్
  • మైదానంలోనే కూర్చోబెట్టి కొట్టాడు
PET Teacher

PET Teacher

Tamil Nadu PET Teacher and Students Video: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని స్కూల్ విద్యార్థుల పట్ల ఓ పీఈటీ టీచర్ దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను చెంప దెబ్బలు కొడుతూ.. ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టాడు. జుట్టు పట్టుకుని కొట్టడమే కాకుండా.. కాళ్లతో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల సదరు పీఈటీ టీచర్‌ను సస్పెండ్ చేశారు.

సేలం జిల్లా మెట్టూరు సమీపంలోని ఓ ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు స్థానికంగా నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయారు. స్కూల్ టీమ్ భారీ తేడాతో ఓడిపోవడంతో.. పీఈటీ టీచర్‌గా విధులు నిర్వహిస్తోన్న అన్నామలై కోపోద్రిక్తుడయ్యాడు. విద్యార్థులను మైదానంలోనే కూర్చోబెట్టి కొట్టాడు. నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ.. జుట్టుపట్టుకుని వారిపై రెచ్చిపోయాడు. కొందరిని చెంప దెబ్బలు కొట్టాడు. ఇంకొందరిని అయితే ఇలానేనా ఆడేది అంటూ.. కాలితో దారుణంగా తన్నాడు.

Also Read: Vizag Fire Accident: విశాఖ బీచ్‌ రోడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రెస్టారెంట్!

టీమ్‌ గోల్‌కీపర్‌ అయిన ఓ విద్యార్ధిపై పీఈటీ టీచర్‌ అన్నామలై రెచ్చిపోయాడు. ‘నువ్ ఏమన్నా అమ్మాయివా?.. బాల్ గోల్ పోస్ట్‌లోకి వెళ్తుంటే అడ్డుకోలేకపోయావ్’ అని అరుస్తూ తన్నాడు. అక్కడున్న ఇతర స్కూల్ విద్యార్థుల ముందు ఘోరంగా అవమానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీఈటీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని సస్పెండ్ చేశారు. తదుపరి విచారణకు ఆదేశించినట్లు సేలం జిల్లా విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.