Today (16-01-23) Stock Market Roundup: గుడ్ మార్నింగ్.. బ్యాడ్ ఈవెనింగ్..

Today (16 01 23) Stock Market Roundup

Today (16 01 23) Stock Market Roundup

Today (16-01-23) Stock Market Roundup: డిసెంబర్ నెలలో టోకు ధరలు తగ్గినప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం నమ్మకం పెరగలేదు. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బిజినెస్‌ కొత్త సంవత్సరంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించట్లేదు. మొదటి రెండు వారాలూ ఫ్లాట్‌గానే కొనసాగిన రెండు సూచీలు మూడో వారంలోనూ అదే ధోరణిలో వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీ.. ఇంట్రాడేలో నేల చూపులు చూసి చివరికి నష్టాలతో ముగిశాయి.

సెన్సెక్స్ తన బెంచ్ మార్క్‌ అయిన 60 వేల పాయింట్లను దాటగలిగింది గానీ నిఫ్టీ మాత్రం బెంచ్‌ మార్క్‌ 18 వేల పాయింట్లకు దిగువనే ఉండిపోయింది. గత వారం పది రోజులుగా స్టాక్ మార్కెట్‌కి మార్నింగ్ గుడ్, ఈవెనింగ్‌ బ్యాడ్‌ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే.. ట్రేడింగ్‌ శుభారంభం అవుతున్నా ముగింపు ఆ స్థాయిలో ఉండట్లేదు. మొత్తానికి సెన్సెక్స్‌ 168 పాయింట్లు కోల్పోయి 60 వేల 92 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది.

Exclusive Story on Ambani Companies: అంబరాన్ని తాకుతున్న.. ‘అంబానీ’ వ్యాపార సామ్రాజ్యం..

నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 17 వేల 894 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌లో 15 స్టాక్స్‌ లాభాల బాటలో, మిగతా 15 స్టాక్స్‌ నష్టాల బాటలో నడిచాయి. టెక్‌ మహింద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌ భారీగా ప్రాఫిట్స్‌ నమోదు చేశాయి. ఈ సంస్థల షేర్ల ధరలు 3 శాతం వరకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీలో ఐటీ మరియు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల సూచీలు బెస్ట్‌ పెర్ఫార్మర్స్‌గా నిలిచాయి. వ్యక్తిగత స్టాక్స్‌ వారీగా పరిశీలిస్తే సులా వైన్‌యార్డ్‌ షేర్లు 15 శాతం పెరిగాయి.

తాజా త్రైమాసికంలో అత్యధిక సేల్స్‌ జరగటం ఈ సంస్థకు కలిసొచ్చింది. 10 గ్రాముల బంగారం రేటు 159 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 483 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 243 రూపాయలు లాభపడి అత్యధికంగా 69 వేల 670 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 19 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 61 పైసల వద్ద స్థిరపడింది. క్రూడాయిల్‌ 34 రూపాయలు పెరిగి 6 వేల 496 రూపాయలుగా నమోదైంది.