NABARD State Focus Paper: వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలి: మంత్రి తుమ్మల

  • మ్యారిగోల్డ్ హోటల్‌లో నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్
  • నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
  • చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది
Nabard

Nabard

వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్లు గుర్తించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో జరిగిన ‘నాబార్డ్’ స్టేట్ క్రెడిట్ సెమినార్ 2025-26కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.

నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ‘రాష్ట్రంలోని వ్యవసాయ రంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్లు గుర్తించాలి. పశుపోషణ, మత్స్యపరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి’ అని అన్నారు.