US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు

  • ‘‘ఇది ఇండియా కాదు’’
  • టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
  • మండిపడుతున్న భారతీయులు
Kelly Smith

Kelly Smith

అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టెక్సాస్ గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కెల్లీ స్మిత్ అనే మహిళ.. భారతదేశ సంస్కృతిపై సంచలన వ్యా్ఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారతీయ సమాజాన్ని అవమానించేలా మాట్లాడిందంటూ భారతీయులు మండిపడుతున్నారు.

కెల్లీ స్మిత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఏఐ సాయంతో రూపొందించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి హిందూ దేవాలయంలో ఉన్నట్లుగా కనిపించింది. ఆ పోస్ట్‌లో ‘‘భారతదేశం నుంచి వచ్చిన వారంతా తమను తాము అమెరికన్లుగానే చెప్పుకుంటున్నారు కాబట్టి.. నేను కూడా భారతీయురాలిగా మారిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొత్త పేరు ‘ప్రియా’. అయితే.. నేను గుడిలో కూడా హాంబర్గర్లు తింటూ.. పాదాలకు బూట్లు ధరించే ఉంటాను. ఎందుకంటే నా టెక్సాస్ సంస్కృతిని నేను వదులుకోలేను. మీ అందరిలాగే నేను కూడా పూర్తిస్థాయి భారతీయురాలినే. నా కొత్త పేరే దానికి నిదర్శనం. నిజానికి మనమందరం భారతీయులుగా మారిపోయి.. గుడిలోనే కొన్ని స్టీక్స్ (Steaks) కాల్చుకుని తినాలి. ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చింది.

ఈ పోస్టుపై భారతీయులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని.. భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకుందని విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలపై స్పందించిన కెల్లీ స్మిత్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడమే కాకుండా భారతీయులపై మరిన్ని ఆరోపణలు చేసింది. ‘‘బర్గర్లు గ్రిల్ చేస్తున్న ఫొటోకే మీరు ఇంత బాధపడుతున్నారు. కానీ టెక్సాస్ సంస్కృతిని గౌరవించకుండా మీరు నిజ జీవితంలో చేస్తున్న పనులు మాకు ఎంత బాధ కలిగిస్తాయో ఊహించండి. సరస్సుల్లో పాలు, పండ్లు, విగ్రహాలు వేయడం మాకు అవమానంగా అనిపిస్తుంది. ప్రతి షాపింగ్ సెంటర్‌లో ఇండియన్ స్టోర్లు పెరుగుతున్నాయి. ఇది ఇండియా కాదు.. టెక్సాస్’’. అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

కెల్లీ స్మిత్ తనను తాను టెక్సాస్‌లోని సీడర్ హిల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంది. గవర్నర్ ఎన్నికల్లో రైట్-ఇన్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతోంది. అంటే ఓటర్లు బ్యాలెట్ పేపర్‌పై స్వయంగా ఆమె పేరు రాయాల్సి ఉంటుంది. ఆమె ప్రచారానికి ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ఆర్థిక మద్దతు లభించినట్లు సమాచారం. ఇక ఆమె ఫండ్‌రైజింగ్ పేజీలో ‘‘టెక్సాస్ టెక్సాన్స్‌దే’’ అని పేర్కొంటూ తన ప్రచారం చాలా కఠినమైనదేనని అంగీకరించింది. అయితే విమర్శకులు మాత్రం సోషల్ మీడియాలో గుర్తింపు పొందేందుకే భారతీయులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపిస్తున్నారు.