తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. రాష్ట్రం లో టీచర్ బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ పెరిగిన విద్యార్థుల సంఖ్యకు సరిపడా కొత్త టీచర్లను భర్తీ చేయలేదు. కనీసం విద్యావలంటీర్లు అయినా లేకుండా అందుబాటులో ఉన్న టీచర్ల తోనే బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరియు వసతులు పెరగడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షితులవుతున్నారని విద్యా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎన్ని వసతులు వున్నా కానీ విద్యార్థులకు తగినట్లుగా టీచర్లు లేకపోతే వారి బోధనపై ప్రభావం పడుతుంది. దీనితో టీచర్ పోస్టుల భర్తీ చేయవలసినదిగా నిరుద్యోగులు కోరుకుంటున్నారు.
అయితే టీచర్ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే టీచర్ ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కూడా భావిస్తున్నట్లు సమాచారం.అయితే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగానే గత ఏడాది టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహించగా, ఈసారి కూడా టెట్ నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ను జారీ చేసింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 15వ తేదీ న టెట్ పరీక్ష ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27 న టెట్ ఫలితాలు వెలువడనున్నాయి.ఆ తరువాత టీచర్ బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనితో అక్టోబర్ లేదా నవంబర్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నోటిఫికేషన్ వెలువడిన ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. దీనితో వచ్చే విద్యాసంవత్సరానికే కొత్త టీచర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగించనున్నట్లు సమాచారం.
