తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన (ఎల్లుండి) రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లా కాటారం వేదికగా నిర్వహించనున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల సమక్షంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు.
రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే గత నెల 23వ తేదీన మొదటి విడత సాయాన్ని విజయవంతంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో ప్రతి రైతుకు కనీసం ఒక ఎకరానికి సరిపడా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. తద్వారా దాదాపు రూ. 3,590 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇప్పుడు రెండో విడతలో మరింత మంది రైతులను ఆదుకునేలా ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read:RCB vs DC: కోహ్లీ మెరుపులు కాసేపే.. భారీ స్కోరు మిస్సైన బెంగళూరు! ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
తాజా సమాచారం ప్రకారం.. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 45,11,947 మంది అర్హులైన రైతులు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 5,653 కోట్లను కేటాయించినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ నిధులు నేరుగా రైతుల చేతికి అందడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు వారికి ఎంతగానో వెసులుబాటు కలుగుతుంది.
కేవలం ఈ రెండు విడతలతోనే ఆగకుండా.. మిగిలిన నిధులను కూడా త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడత ప్రక్రియ పూర్తికాగానే.. మూడో విడత నిధులను కూడా వీలైనంత వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఇలా ఆర్థిక సాయం అందడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న ఈ శ్రద్ధ వ్యవసాయ రంగానికి కొత్త జీవం పోస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
