తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో (MPDO కార్యాలయం) మండల స్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిస్తూ పౌర సంబంధాల శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబడింది. స్థానిక సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్, MPO, MAO, MEO, PHC వైద్య అధికారి, CDPO, సంక్షేమ అధికారులు, విద్యుత్ (TGSPDCL/TGNPDCL), నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు-భవనాలు, అటవీ శాఖలతో పాటు ఇతర అన్ని ముఖ్య శాఖలకు చెందిన దాదాపు 23 రకాల మండల స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా ఈ సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ప్రజలు చిన్నచిన్న సమస్యలు, భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు లేదా స్థానిక మౌలిక వసతుల దరఖాస్తుల కోసం జిల్లా కలెక్టరేట్లకు వెళ్లాల్సి వచ్చేది. మండల స్థాయిలోనే ఈ వేదిక అందుబాటులోకి రావడం వల్ల గ్రామీణ ప్రజలకు ప్రయాణ భారం, సమయం, ఆర్థిక ఖర్చులు తగ్గుతాయి. అర్జీల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్లైన్ లేదా రిజిస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, వచ్చిన ప్రతి దరఖాస్తుకు నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టనున్నారు. తద్వారా జవాబుదారీతనం పెరిగి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయి.

