Site icon NTV Telugu

Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..

Holidays

Holidays

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు.. ఆయా రాష్ట్రాలకు చెందిన వారై ఉండి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్ల కోసం ప్రత్యేక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు కార్మిక , ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికలు జరుగుతున్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎవరైతే తెలంగాణలో ఉద్యోగ రీత్యా లేదా ఇతర పనుల నిమిత్తం స్థిరపడ్డారో.. వారందరికీ తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించబడింది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రకాల ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు, ఉద్యోగులకు పోలింగ్ రోజున ‘పెయిడ్ హాలిడే’ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు సూచనలు జారీ అయ్యాయి.

Also Read:Iran Nuclear Plant: బిగ్ షాక్.. ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం వద్ద దాడి..

అసోం, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఓటర్ల కోసం ఏప్రిల్ 9వ తేదీన సెలవు ప్రకటించారు. తమిళనాడు ఓటర్ల కోసం ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక సెలవు వర్తించనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వివిధ దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, అక్కడి ఓటర్ల కోసం ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29 తేదీల్లో సెలవులను కేటాయించారు.

ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఓటు వేయడానికి తగిన సమయం కల్పించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశం. ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించి, ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Exit mobile version