KCR: రోడ్డు ప్రమాద ఘటనలపై కేసీఆర్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా చెల్లించాలని..!

Kcr

Kcr

KCR React on Nalgonda Road Accidents: నల్గొండ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాల ఘటనలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కేసీఆర్‌ కోరారు. అలానే మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: Atal Bihari Vajpayee: కోట్లాది ఇల్లు నిర్మించారు.. కుగ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్‌పేయిది: కిషన్ రెడ్డి

నల్లొండ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. పెద్దవూర మండలం నిమ్మానాయక్‌ తండాకు చెందిన రమావత్‌ కేశవులు (28) ఆదివారం రాత్రి బైక్‌పై మిర్యాలగూడ నుంచి వస్తూ సైదులు (55) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. వేంపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కేశవులు కుటుంబ సభ్యులు ఏడుగురు సోమవారం తెల్లవారుజామున టాటా ఏస్‌ వాహనంలో ఘటనాస్థలికి బయల్దేరారు. టాటా ఏస్‌ వాహనాన్ని ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గన్యా (40), నాగరాజు (28), పాండ్య (40), బుజ్జి (38) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ముగ్గురిలో ఒకరు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.