Chandrababu Case: చంద్రబాబు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

Chandrababu

Chandrababu

Chandrababu Case: టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా.ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు కొనసాగనున్నాయి.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభంకానుంది.. ఈ రోజు 45వ ఐటెమ్ గా లిస్ట్ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించనున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముకుల్ రోత్గి వాదనలు కొనసాగించనున్నారు.. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఏ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు.. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి ఏపీ ప్రభుత్వ వాదనలు పూర్తికానందున ఈ రోజు మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే ముకుల్‌రోహత్గీ తన వాదనలను కొనసాగించనున్నారు..

Read Also: Same Gender Marriage: నేడే స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

కాగా, హైకోర్టులో దాఖలుచేసిన క్వాష్‌పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు గత నెల 22వ తేదీన తీర్పును వెలువరించింది.. అయితే, హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. ఈ కేసు విచారణ సెప్టెంబర్‌ 23వ తేదీ నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తుండగా.. ఈ రోజు ఇరుపక్షాల వాదనలు ముగించనున్నారు.. మరోవైపు.. ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.. దీంతో.. ఇవాళ చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణ ముగిసన వెంటనే.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ సాగనుంది.