Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!

Sugar Prices

Sugar Prices

Sugar Prices: పండగల సీజన్ వస్తోందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండివంటల సందడి, తీపి నోళ్లు పలకరించుకోవడం సాధారణం. కానీ ఈసారి ఆ పండగ తీపికి ధరల సెగ తగిలేలా ఉంది. దేశంలో చక్కెర ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య గృహిణుల నుంచి మిఠాయిల తయారీదారుల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఒకవైపు పెరుగుతున్న ధరలతో జేబులు ఖాళీ అవుతుంటే, మరోవైపు కావాల్సినంత చక్కెర కూడా దొరకక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో చక్కెర కొనుగోలుపై స్పష్టమైన కోతలు కనిపిస్తున్నాయి. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా, నేరుగా సూపర్‌మార్కెట్‌కు వెళ్లినా పరిమితులకు లోబడే షాపింగ్ చేయాల్సి వస్తోంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ క్విక్-కామర్స్ యాప్‌లు ఒకే ఆర్డర్‌లో ఇన్ని ప్యాకెట్లు మాత్రమే కొనాలనే నిబంధన పెట్టాయి. ఉదాహరణకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో క్రిస్టల్ షుగర్ ఒక్కో ఆర్డర్‌కు కేవలం రెండు కేజీల ప్యాకెట్లకు మాత్రమే పరిమితం చేశారు. కొన్ని ప్లాట్‌ఫామ్‌లలోనైతే కొన్ని రకాల బ్రాండ్లు దొరకడమే కష్టంగా మారి ‘స్టాక్ లేదు’ అని చూపిస్తున్నాయి.

ఈ పరిమితులు కేవలం ఆన్‌లైన్ సేవలకు మాత్రమే పరిమితం కాలేదు. మన ఇంటి పక్కనే ఉండే డి-మార్ట్, రిలయన్స్ వంటి బడా ఆఫ్‌లైన్ రిటైల్ చైన్లలోనూ ఇదే పరిస్థితి నెలకుంది. అక్కడ కూడా ఒక్కో కస్టమర్‌కు 2 నుంచి 3 కేజీలకు మించి చక్కెరను విక్రయించడం లేదు. కృత్రిమ కొరత సృష్టించకుండా, వ్యాపారులు హోల్‌సేల్‌గా కొని దాచిపెట్టకుండా ఉండటానికే రిటైలర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోజూవారీ అవసరాలకు కేజీ, అరకేజీ కొనేవారికి ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కానీ, పండగల కోసం ఎక్కువ మొత్తంలో పిండివంటలు చేసుకునే కుటుంబాలకు, స్వీట్ షాపులకు ఈ రీటైల్ కోతలు పెద్ద దిగ్భ్రాంతినే కలిగిస్తున్నాయి.

ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచడం, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలను అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, దీపావళి వరుస పండగల వేళ సుమారు 10 లక్షల టన్నుల రా-షుగర్ (పచ్చి చక్కెర)ను సుంకం లేకుండా (డ్యూటీ ఫ్రీ) దిగుమతి చేసుకునేందుకు శ్లాబ్ కేటాయించింది. మొదట్లో ఈ ప్రాసెసింగ్ ప్రక్రియకు అక్టోబర్ 31 వరకు మాత్రమే గడువు ఇచ్చినా, తాజాగా దాన్ని సవరించింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను రిఫైన్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేయడానికి వ్యాపారులకు ‘బిల్ ఆఫ్ ఎంట్రీ’ దాఖలు చేసిన నాటి నుంచి రెండు నెలల సమయం ఇచ్చింది. దీనివల్ల రిఫైనరీలకు కాస్త ఊరట లభించడమే కాకుండా మార్కెట్‌లోకి సరుకు క్రమంగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడానికి, దిగుమతి చేసుకున్న చక్కెర రిఫైన్ అయి మార్కెట్‌లోకి రాడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు పండగల డిమాండ్ తారాస్థాయికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలో ధరలను తగ్గిస్తాయో, కొనుగోలు పరిమితులను ఎత్తివేస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం కొనే శక్తి ఉన్నా, అనుకున్నంత చక్కెర దొరక్క వినియోగదారులు పండగ వేళ ఈ ‘చేదు’ నిజాన్ని మింగక తప్పడం లేదు.