దేశీయ స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీచడంతో మార్కెట్ అమాంతంగా బలపడింది. సోమవారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. లాభాలతో ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇదే ఒరవడి మధ్యాహ్నం వరకు కొనసాగింది.
కానీ మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్లో కొసాగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై మధ్యవర్తులు రంగంలోకి దిగడంతో కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం జరిగే సూచనలు ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొత్త ఊపు వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 469 పాయింట్లు లాభపడి 73,793 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 22, 867 దగ్గర కొనసాగుతోంది.
కాల్పుల విరమణ ఆశలతోనే సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్, మిడ్క్యాప్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది. చమురు సరఫరా అంతరాయాలపై కూడా ఆందోళనలు తగ్గాయి. దీంతో భారత మార్కెట్లు సోమవారం మధ్యాహ్నం నష్టాల నుంచి కోలుకుని. భారీగా పుంజుకున్నాయి. ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలను మినహాయించి.. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.