Speaker Notices to Rebel MLAs: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుందని.. ఈ రోజు ఉదయం పూట విచారణకు రావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం సమయంలో విచారణకు రావాల్సిందిగా టీడీపీ రెబెల్స్కు నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.. స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలు జారీ చేసింది. కాగా, వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని ఇప్పటికే స్పీకర్కు వైసీపీ రెబెల్స్ లేఖ రాసిన విషయం విదితమే.
Read Also: Tata-Airbus: టాటా-ఎయిర్బస్ కీలక ఒప్పందం.. సంయుక్తంగా హెలికాప్టర్ల తయారీ..
కాగా, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేఖ రాసిన విషయం విదితమే.. తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు పంపారు. ఇక, తాము అందుకున్న నోటీసులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.. తమపై ఫిర్యాదు చేసిన వారు సమర్పించిన ఆధారాలను అందించాలని.. వాటిని పరిశీలించేందుకు 4 వారాల గడువు కూడా ఇవ్వాలంటూ స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రిప్లై ఇవ్వడానికి 30 నుంచి 60 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నోటీసులతో పాటు పంపిన పేపర్, వీడియో క్లిప్పింగ్లు అసలైనవో.. మార్ఫింగ్ చేసినవో నిర్ధారించుకోవాలి కదా? అని ప్రశ్నించారు.. మరోవైపు.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ రెబల్స్కు కూడా స్పీకర్ కార్యాలయంలో నోటీసు ఇవ్వడంతో.. ఈ నెల 29వ తేదీన ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది.