Smriti Irani: రాహుల్‌కి స్మృతిఇరానీ సవాల్

Smriti Irani

Smriti Irani

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సవాలు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయాలని స్మృతి ఇరానీ సవాలు చేశారు. రాహుల్‌కి అమథీలో ఎంత ప్రజాదారణ ఉందో ఈరోజు భారత్ జోడో యాత్ర చూస్తే అర్థమవుతుంది అన్నారు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు రాలేదని ఎద్దేవా చేశారు. అమేథీ వీధులన్నీ ఖాళీగా కనిపించాయని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అమేథీ (Amethi) పార్లమెంటరీ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన ‘జన్ సంవాద్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అలాగే రాహుల్ సైతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అమేథీలో పర్యటిస్తున్నారు.

అమేథీ కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా.. కేరళలోని వయనాడ్‌లో విజయం సాధించారు.