ఒవైసీ ఇంటిపై దాడి కేసులో..ఆరుగురు అరెస్ట్..!

ఢిల్లీలోని MiM ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ నివాసంపై హిందూ సేన దాడి చేసింది. పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ఉన్న ఇంటికి వెళ్లిన హిందూసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. నేమ్‌ ప్లేట్‌ను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని ఆరురుగురిని అరెస్టు చేసి తరలించారు. మరోవైపు జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసద్‌. తన నివాసంపై దాడి జరగడం ఇది మూడో సారి అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో గొడ్డళ్లు, కర్రలతో వచ్చి దాడికి పాల్పడారని ట్వీట్‌ చేశారు అసద్‌. తనను చంపుతామంటూ నినాదాలు చేశారని తెలిపారు. 40 ఏళ్లుగా తన ఇంటి బాగోగులు చూసుకుంటున్న రాజు కుటుంబం భయంతో గడుపుతోందన్నారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌లోని ఓ ఎంపీ ఇంటికే రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను భయపెట్టాలని చూస్తున్నారని… మజ్లిస్‌ గురించి వారికి తెలియదని… అయన్న ఎంపీ… తన న్యాయ పోరాటం ఆగబోదన్నారు