Sircilla: చేనేతల కళాఖండం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అగ్గి పెట్టెలో పట్టేంత చీర నేసిన నేతన్నలను మనం చూశాం. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చేనేత దంపతులు మరో కళా ఖండాన్ని సృష్టించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నారీ శక్తిని ప్రతిబింబించేలా చేనేత మగ్గంపై నేసిన ప్రత్యేక పట్టుచీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు నెలల పాటు కష్టపడి హరిప్రసాద్, రేఖా దంపతులు ఈ అపురూపమైన చీరను తయారు చేశారు. మన దేశ మహిళలు సాధించిన ఘన విజయాలను గుర్తు చేస్తూ.. వాటిని ఒకే చీరపై ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ఈ పట్టు చీరను నేశారు. గత ఏడాది మన దేశ ఆడబిడ్డలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత మహిళల సత్తా చాటారు.
READ MORE: Iran war: ఇరాన్ పాలనలో చీలిక, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.? అమెరికా-ఇజ్రాయిల్ ప్లాన్ సక్సెస్..
అదే విధంగా క్రీడారంగంలోనూ మహిళలు సత్తా చాటారు. మహిళల క్రికెట్ వరల్డ్ కప్, మహిళల కబడ్డీ వరల్డ్ కప్, అంధుల మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజయాలతో పాటు అర్చర్ సీతల్ దేవి, షూటర్ సుజిత్ సింగ్ వంటి క్రీడాకారిణుల విజయాలను కూడా ఈ చీరపై ప్రతిబింబించారు. ఈ ప్రత్యేక పట్టుచీరను తయారు చేయడానికి హరిప్రసాద్ – రేఖా దంపతులు దాదాపు మూడు నెలల పాటు శ్రమించారు. మహిళల సాధించిన విజయాలను దేశ ప్రజలకు గుర్తు చేస్తూ.. వారికి అభినందనలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ చీరను తయారు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల విజయాలకు అంకితం చేస్తూ ఈ ప్రత్యేక చీరను సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు.
