Sigachi Blast: మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా.. 90 రోజులు కంపెనీ మూసివేత!

  • పాశమైలారం ప్రమాదంపై స్పందించిన సిగాచీ కంపెనీ
  • పేలుడు కారణంగా 40 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా
  • 90 రోజులు కంపెనీ మూసివేత
Sigachi Blast

Sigachi Blast

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై సిగాచీ కంపెనీ స్పందించింది. పరిశ్రమలో పేలుడు కారణంగా 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని బీమా క్లైమ్ ఇస్తామని స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సిగాచీ కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మేరకు సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు.. మినిమం అవగాహన లేదు!

‘ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. 33 మందికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి కోటి పరిహారంతో పాటు అన్ని రకాల బీమా క్లైమ్ చెల్లిస్తాం. గాయపడ్డ వారికి పూర్తి వైద్యం అందిస్తాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. పరిశ్రమ ప్రమాదంపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి లేఖ రాశాం. మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలు మూసివేస్తున్నాం. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు. ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నాం’ అని సిగాచీ కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్‌ ప్రకటనలో పేర్కొన్నారు.