Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!

Aamir Khan Praises Sai Pallavi

Aamir Khan Praises Sai Pallavi

సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రానికి సిద్ధమైంది. అమీర్ ఖాన్ నిర్మాణంలో, ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏక్ దిన్’ (Ek Din) చిత్రంతో ఆమె హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. మే 1న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా ప్రదర్శన అనంతరం అమీర్ ఖాన్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. జునైద్ నటన కంటే కూడా సాయి పల్లవి నటన తనను ఎంతగానో కదిలించిందని ఆయన పేర్కొన్నారు.. ‘సాయి పల్లవి అద్భుతమైన నటి. మన దేశంలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ యాక్ట్రెస్ ఆమె అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను’ అని అమీర్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే తొలి హిందీ సినిమా కావడంతో సాయి పల్లవి కొంత ఆందోళన వ్యక్తం చేశారు.. ‘దక్షిణాదిలో నాకు ఎంతో అనుభవం ఉన్నా, బాలీవుడ్ ఎంట్రీ నాకు ఒక సవాలుగా అనిపిస్తోంది. హిందీ ప్రేక్షకులు నన్ను ఎలా స్వీకరిస్తారోనని భయంగా ఉంది. అమీర్ గారు ఎమోషనల్ అయినప్పుడు నాకూ కన్నీళ్లు వచ్చాయి, కానీ ఆయనలా అందరి ముందు చూపించే ధైర్యం నాకు లేదు’ అని ఆమె వినమ్రంగా చెప్పుకొచ్చారు. కాగా ‘ఏక్ దిన్’ తర్వాత సాయి పల్లవి బాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్ ‘రామాయణం’ లో నటిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, ఆమె సీతగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది.