Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్‌తో సంబంధం ఏంటి..?

Throw

Throw

కామన్వెల్త్ గేమ్స్ 2026 జావెలిన్ త్రో పోటీల్లో శ్రీలంకకు చెందిన యువ అథ్లెట్ రుమేశ్ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజత పతకానికే పరిమితమవ్వగా, శ్రీలంకకు చెందిన పతిరాగే ఏకంగా 89.75 మీటర్ల సుదూర ప్రాంతానికి ఈటెను విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రాతో పాటు ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్కాట్, ఆండర్సన్ పీటర్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలను వెనక్కి నెట్టి రుమేశ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే పోటీలో భారత్‌కే చెందిన మరో అథ్లెట్ యష్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

మార్చి 21, 2003న జన్మించిన రుమేశ్ పతిరాగే ప్రయాణం చాలా ఆసక్తికరమైనది. చిన్నతనంలో క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, సెంట్ పీటర్స్ కాలేజీ తరఫున మీడియం పేసర్‌గా రాణించాడు. కౌమారదశలోనే ఆయన బౌలింగ్ వేగం గంటకు 134 కిలోమీటర్లుగా నమోదవ్వడం విశేషం. డిస్కస్, షాట్‌పుట్ త్రోయర్ అయిన తన తండ్రి సలహాతో మొదట డిస్కస్ త్రో ప్రాక్టీస్ చేసిన రుమేశ్, 2017లో తన కోచ్ టోనీ ప్రసన్న మార్గదర్శకత్వంలో జావెలిన త్రో వైపు అడుగులు వేశాడు. ఆటలోని ప్రాథమిక సూత్రాలు, జీవిత పాఠాలు నేర్పిన తన కోచ్ టోనీయే తన ఈ విజయానికి ముఖ్య కారణమని రుమేశ్ కృతజ్ఞతగా వెల్లడించాడు.

కెరీర్ ప్రారంభం నుండి నిలకడైన ప్రదర్శన కనబరచడం రుమేశ్ ప్రత్యేకత. శ్రీలంక గత అథ్లెట్లు కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే మెరిసి ఆ తర్వాత ఫామ్ కోల్పోగా, రుమేశ్ మాత్రం వరుసగా 82 మీటర్లకు పైగా త్రో విసురుతూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. 2025 సీజన్‌లోనే ఆయన ఏకంగా 13 సార్లు 82 మీటర్ల మార్కును దాటడం ఆయన నిలకడకు నిదర్శనం. క్రికెట్ మైదానంలో పేస్ బౌలర్‌గా సత్తా చాటిన ఈ యువ అథ్లెట్, ఇప్పుడు జావెలిన్ త్రోలో ప్రపంచ దిగ్గజాలనే ఓడించి శ్రీలంక క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.