SLBC Tunnel Collapse: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్.. లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ!

  • ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్
  • లభించని ఆరుగురు కార్మికుల ఆచూకీ
  • నోగో జోన్‌లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం
Slbc Tunnel Collapse

Slbc Tunnel Collapse

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. షిర్ జోన్‌లో తవ్వకాలు అసాధ్యం అని రెస్క్యూ బృందాలు అంటున్నాయి. దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోగో జోన్‌లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో రెండు మృతదేహాలను వెలికితీశారు.

ఫిబ్రవరి 22న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మార్చి 9న గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక మార్చి 22న ప్రాజెక్టు ఇంజినీర్‌ మనోజ్‌ కుమార్‌ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటినుంచి రెస్క్యూ ఆపరేషన్ కొసనాగుతున్నా.. మరో ఆరుగురు కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. టన్నెల్‌లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రం (టీబీఎం) భాగాలను బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్‌ జోన్‌గా గుర్తించారు. ఈ జోన్‌కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి.