RCB Brand Value: ఐపీఎల్ (IPL) చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదైంది! ఐపీఎల్లో ఆర్సీబీ మరో రికార్డ్ను సొంతం చేసుకుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘హులిహాన్ లోకీ’ (Houlihan Lokey) విడుదల చేసిన 2026 బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏకంగా 312 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,600 కోట్లు) బ్రాండ్ విలువతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెట్ జట్టుగా చరిత్ర సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఆర్సీబీ బ్రాండ్ విలువ ఏకంగా 16 శాతం పెరగడం విశేషం. ఈ జాబితాలో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 264 మిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో నిలవగా.. కోల్కతా నైట్ రైడర్స్ (245 మిలియన్ డాలర్లు), చెన్నై సూపర్ కింగ్స్ (244 మిలియన్ డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు ఐపీఎల్ లీగ్ మొత్తం బిజినెస్ వాల్యూ గత ఏడాదితో పోలిస్తే 11.4 శాతం పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు చేరగా, కేవలం లీగ్ బ్రాండ్ విలువ మాత్రమే 10.3 శాతం వృద్ధితో 4.3 బిలియన్ డాలర్లను తాకింది.
ఫ్రాంచైజీల కొనుగోలు ఒప్పందాలు కూడా ఈసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీని బ్లాక్స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ల కన్సార్టియం సుమారు 1.78 బిలియన్ డాలర్ల విలువతో కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా 1.65 బిలియన్ డాలర్ల విలువతో యాజమాన్య హక్కులను మార్చుకుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ ఐపీఎల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అధికారిక ప్రసారకర్త జియోస్టార్ (JioStar) వివరాల ప్రకారం, ఈ 2026 సీజన్ ఏకంగా 1.06 బిలియన్ స్క్రీన్లకు చేరగా, వీక్షకుల సంఖ్య 7 శాతం పెరిగింది. ముఖ్యంగా కనెక్టెడ్ టీవీ (CTV) ద్వారా చూసేవారి సంఖ్య 26 శాతం వృద్ధి చెందింది. ఈ రకమైన డిజిటల్ విస్తరణ, ప్రీమియం భాగస్వామ్యాల ద్వారా ఐపీఎల్ ఈ ఒక్క సీజన్లోనే 1.8 బిలియన్ డాలర్లకు పైగా రాబడిని గడించి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న స్పోర్ట్స్ లీగ్లలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

