ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళలో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ప్రకాశ్గౌడ్, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య వంటి నేతలు పార్టీ మారిన తర్వాత ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కక, పదవులు రాక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తమ నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కలేదనే భావనలో ఉన్నారట ముగ్గురూ. బయటపడకున్నా…. తమ సన్నిహితుల దగ్గర ఈ ముగ్గురూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ మారిన పలువురికి ఇప్పటికే ప్రభుత్వంలో, పార్టీ పరంగా బాధ్యతలు దక్కాయి.
కానీ… తమ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రంగారెడ్డి ఎమ్మెల్యేలు డీలా పడుతున్నారట. నియోజకవర్గ అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం వంటి అంశాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. అయితే ఈ అసంతృప్తి బహిరంగంగా బయటపడే వాతావరణం లేదని, ప్రస్తుతానికి పరిస్థితిని గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు, ఈ తరహా ప్రచారాలను కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని, పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో సహజంగానే ఇలాంటి అసంతృప్తులు వస్తుంటాయని అంటున్నారట కాంగ్రెస్ ముఖ్యులు. రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములు ఉన్న ప్రాంతం రాజేంద్ర నగర్. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక్కడ అధికార పార్టీ నుంచి ఎవరికి వారు అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు.
ఓ కీలక నేత కుటుంబ సభ్యులు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం.. ఇతరత్రా అంశాలను పరిష్కరించడం లాంటి వాటిలో మునిగి తేలుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ ఎమ్మెల్యే అనే గుర్తింపే ఉండటం లేదని ప్రకాష్గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సొంత పార్టీ నేతలు కనీస గౌరవం ఇవ్వడం లేదని మధనపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు అంతో ఇంతో మర్యాద ఇచ్చే వారని, ఇప్పుడు గౌరవం లేక, పార్టీలో ప్రాధాన్యం లేక, నియోజకవర్గంలో అభివృద్ధి పనులుకాక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇక అరికెపుడి గాంధీది మరోరకమైన అసంతృప్తి. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారుగానీ.. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆయన. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కూడా అంతంతే మంజూరు అవుతుతున్నాయంటున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీలో సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంగా ఉన్నారని, ముందు ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలంటున్నాయి రాజకీయవర్గాలు.

