Dhurandhar: బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ పాత ప్రచారంపై ప్రముఖ నటుడు రాకేష్ బేడీ స్పందించారు. ఈ చిత్రాల కథ, స్క్రిప్ట్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి వచ్చిందంటూ గతంలో వచ్చిన వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాకేష్ బేడీ.. ఈ ఫ్రాంచైజీలో హాస్యానికి తాను చేసిన సహకారం గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘ధురంధర్’ సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ డైలాగ్ లలో ఒకటైన “యోర్ బ*క్స్ ఆర్ వెరీ వైట్” అనే డైలాగ్ను ప్రస్తావిస్తూ పీఎంఓ స్క్రిప్ట్ ప్రచారాన్ని వ్యంగ్యంగా కొట్టిపారేశారు. ఆ విషయంపై స్పందించిన రాకేష్ బేడీ.. “సినిమా హిట్ అయిన తర్వాత కొందరు ‘ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి రాసి వస్తుందని అన్నారు. అప్పుడు నేను వాళ్లను అడిగాను.. పీఎంఓలో అలాంటి డైలాగ్ రాయగల వ్యక్తి ఎవరు ఉన్నారు? అసలు అలాంటి విషయం ఎవరూ ఊహించలేరు” అని వ్యాఖ్యానించారు. దీనితో అతని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రాకేష్ బేడీ వెల్లడించిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ‘ధురంధర్’ కథలో మొదట్లో కామెడీకి పెద్దగా స్థానం లేదట. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ కథ చాలా సీరియస్గా ఉందని ఆయన భావించారట. స్క్రిప్ట్ను రెండు మూడు సార్లు చదివిన తర్వాత కొన్నిచోట్ల హాస్యాన్ని జోడిస్తే ప్రేక్షకులకు ఉపశమనం లభిస్తుందని ఆయన దర్శకుడు ఆదిత్య ధర్కు సూచించినట్లు తెలిపారు.
“నేను ఆదిత్య ధర్ను కలిసి కొన్ని సన్నివేశాల్లో కామెడీ జోడించే అవకాశం ఉందని చెప్పాను. అయితే అప్పట్లో ఆయన కొంత సందేహంతో ఉన్నారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆ హాస్య సన్నివేశాలు బాగా పనిచేస్తున్నాయని ఆయన కూడా గుర్తించారు. తర్వాత మేమిద్దరం వాటిని మరింత ఆస్వాదించాం” అని రాకేష్ బేడీ వెల్లడించారు. ‘ధురంధర్’ ఫ్రాంచైజీలో రాకేష్ బేడీ పోషించిన జమీల్ జమాలి పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. భారత గూఢచారి సంస్థ తరఫున పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలోకి చొరబడే ఏజెంట్గా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంవత్సరాల పాటు కొత్త గుర్తింపుతో జీవిస్తూ చివర్లో తాను అండర్కవర్ ఏజెంట్ అనే విషయం బయటపడే ట్విస్ట్ సినిమాకు ప్రధాన ట్విస్ట్.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ తొలి భాగం 2025 డిసెంబర్ 5న విడుదలై ఘన విజయం సాధించింది. అనంతరం సీక్వెల్ 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫ్రాంచైజీలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పండోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

