NTV Telugu Site icon

Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు..

Rains

Rains

Rains: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలకు వర్షాలు ఓ మోస్తరు ఉంటాయని వెల్లడించింది.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మూడు రోజుల పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read also: Parliament Session : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10గంటలకు మోడీ మీడియా సమావేశం

చిలికా సరస్సు వద్ద ఏర్పడిన గాలి వ్యవస్థ బలహీనపడి రాత్రి సమయంలో అల్పపీడనంగా మారిందని వివరించింది. వాయువ్య దిశగా పయనిస్తూ ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలను తాకింది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హనుకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపే, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు చాలా చోట్ల ముంపునకు గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుంది. కాగా, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 195 గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాల వల్ల చాలా చోట్ల ఆస్తి నష్టం జరగగా, ఒకరి మృతిని అధికారికంగా ప్రకటించారు. కాగా, నిన్న సాయంత్రం ధవళేశ్వరం వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈరోజు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.