రైల్వేలో జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్ డి పోస్టుల భర్తీకి రైల్వే శాఖ షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలో పాల్గొని ఎంపిక కావాలి.
Also Read:Smartphone Launch in India: అదిరిపోయే ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న వన్ ఫ్లస్ టర్భో
ఈ పరీక్షలో అవసరమైన కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులు నియామక ప్రక్రియ తదుపరి దశ అయిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)కి అర్హులు అవుతారు. PET తర్వాత, అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లో పాల్గొనవలసి ఉంటుంది. అన్ని దశల తర్వాత, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.500 దరఖాస్తు ఫీజును చెల్లించాలి. SC/ST, PH/EBC, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు రూ.250 ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తులు జనవరి 21, 2026 నుండి ప్రారంభమవుతాయి. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక పోర్టల్, rrbapply.gov.in ని సందర్శించాల్సి ఉంటుంది.
