PV Sindhu:మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్య ప్రయాణికులతో పాటు ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం, యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్లో చిక్కుకుపోయారు. ప్రతిష్ఠాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026’ టోర్నీలో పాల్గొనేందుకు పీవీ సింధు బ్రిటన్ (యూకే) బయలుదేరారు. దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన ఆమె విమానం.. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అక్కడే నిలిచిపోయింది. విమానాశ్రయం మూసివేతతో అధికారులు ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో సింధును ఎయిర్పోర్ట్ సమీపంలోని ఒక హోటల్కు తరలించారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ప్రస్తుతం హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్నానని సింధు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు సమాచారం అందించారు.
READ ALSO: Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
విమానాశ్రయంలో విద్యార్థుల అవస్థలు..
మరోవైపు, మహారాష్ట్రలోని పుణేకు చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు సైతం దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. తమ ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ప్రాజెక్ట్ ముగించుకుని స్వదేశానికి బయలుదేరేందుకు నిన్న సాయంత్రమే వారు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాలు రద్దు కావడంతో వారు ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్-అమెరికా భీకర పోరు ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం ఇప్పుడు బోసిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడమే కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు ఎక్కడికక్కడే వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 కారణాలే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?
