OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి..
  • ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం..
  • మీకు దక్కిందిగానీ..మాకేంద వచ్చిందని కోదండరామ్‌కు ప్రశ్న
Kodandaram

Kodandaram

ఒకప్పటి తెలంగాణ ఉద్యమ గొంతుక ఇప్పుడు ఇరకాటంలో పడిందా? గత్యంతరం లేని పరిస్థితుల్లో స్వర సవరణ మొదలుపెట్టిందా? కరవమంటే కప్పకు కోపం-విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైందా? నీ మాట వినేకదా ఓట్లేశాం… అంటూ యువత నిలదీసేదాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరా పెద్దాయన? ఇక గేర్‌ మార్చబోతున్నారన్నది నిజమేనా?

తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది మంది విద్యార్థులు, యువతకు ప్రొఫెసర్ కోదండరాం ఒక నమ్మకంలా నిలిచారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగుల సమస్యలపై అశోక్‌నగర్ నుంచి ధర్నా చౌక్ వరకు నిరుద్యోగులకు గొంతుక అయ్యారాయన. ఆ సందర్భంగానే…. ప్రభుత్వం మారితే తమ బతుకులు మారతాయని, లక్షలాది కొలువులు వస్తాయని యువత ఆశపడింది. అయితే… ఎన్నికలై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కానీ… ఉద్యోగాల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు, జీవోల సవరణ వంటి అంశాల్లో ఆశించిన వేగంతో నిర్ణయాలు రాకపోవడం కారణంగా నిరుద్యోగుల్లో ఆసహనం పెరుగుతోంది.

అలా… ఓపిక నశించిన వాళ్ళ ఆగ్రహం చివరికి కోదండరాం వైపే మళ్లింది. నాడు ‘మీ మాట వినే కదా మేం అధికార మార్పు కోరుకున్నాం.. ఇప్పుడు మీకైతే ఎమ్మెల్సీ ఉద్యోగం దక్కిందిగానీ… మాకేం వచ్చింది?’ అంటూ యువత సూటిగా నిలదీస్తోంది ఆయన్ని. ఒకప్పుడు ఎవరినైతే తమ ప్రతినిధిగా భావించారో, ఆయన పైనే ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగరేసే పరిస్థితి వచ్చింది. పుస్తకాలతో కుస్తీ పడుతూ ఏళ్ల తరబడి వేచి చూస్తున్న యువత ఆవేదనను కప్పిపుచ్చడం ప్రస్తుతం ఎవరి వల్లా కావడం లేదట. రోడ్ల మీద చేస్తున్న నిరసనలు, సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్‌ ప్రొఫెసర్‌కు ఊపిరాడనివ్వడం లేదని అంటున్నారు.

నిరుద్యోగుల అగ్రహ జ్వాలలు నేరుగా తనవైపే వస్తుండటాన్ని గమనించిన ఎమ్మెల్సీ…. ఇక మౌనంగా ఉంటే తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్‌ అవుతుందని గ్రహించారట. తాజాగా ఆ సెగ గట్టిగా తాకడంతో ఇక గేర్‌ మార్చక తప్పదన్న నిర్ణయానికి వచ్చి… ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారట. నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆందోళన తీవ్రత ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు, అధికారులకు అర్థం కావడం లేదంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం అందులో భాగమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసలు సమస్య ఎక్కడుందో పాలకులు గుర్తించలేకపోతున్నారని కూడా అన్నారు కోదండరామ్‌.అయితే ఇక్కడే ఆయన పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా మారిందని అంటున్నారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ పాలకపక్షాన్ని గట్టిగా విమర్శించలేరు. అలాగని నిరుద్యోగుల తరఫున మాట్లాడకపోతే క్షేత్రస్థాయిలో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రకంగా ఇరుకునపడ్డ ప్రొఫెసర్.. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నారట. కోదండరాం చేసిన తాజా వ్యాఖ్యలు అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగ సమస్య అనేది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రజాక్షేత్రంలో ఎంతటి పెనుతుఫానును సృష్టిస్తుందో ప్రొఫెసర్‌కు ఎదురైన అనుభవాలే నిదర్శనం.

కేవలం మాటలతో సరిపెట్టకుండా, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా కోదండరాం ఎంతవరకు చొరవ చూపుతారు? సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను కొలిక్కి తెస్తారా? లేక ఆయన పరిస్థితి మరింత ఇరకాటంలో పడుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా.. నిరుద్యోగుల ఆక్రందన ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాంరెడ్డిని సైతం డిఫెన్స్‌లో పడేసిందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొని సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుందో లేదో చూడాలి.