Prateek Yadav Dies: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సవతి తమ్ముడు ‘ప్రతీక్ యాదవ్’ (Prateek Yadav) బుధవారం లక్నోలో కన్నుమూశారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. ప్రతీక్ యాదవ్, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ భర్త.
సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ప్రతీక్ యాదవ్ను చికిత్స కోసం లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆయనను తీసుకువచ్చే సమయానికి పల్స్ లేదు. గత కొంతకాలంగా ప్రతీక్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వారాల క్రితం లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. ఆ సమయంలో అఖిలేష్ యాదవ్ కూడా ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో తిరిగి ఇంటికి తీసుకవచ్చారు కూడా.
మరణానంతరం ప్రతీక్ యాదవ్ మృతదేహాన్ని లక్నోలోని కేజీఎంయూ ఆసుపత్రిలోని పోస్టుమార్టం కేంద్రానికి తరలించారు. అక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ వైద్యుల బృందం వీడియో గ్రాఫీ పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించింది. ఈ ప్రక్రియ సుమారు గంటపాటు సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీక్ ఎంతో మంచివాడని.. వ్యాపారం, ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవాడని తెలిపారు. వ్యాపార నష్టాలు వ్యక్తిపై మానసిక ప్రభావం చూపవచ్చని పేర్కొంటూ ఇటీవల ఆయన ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం జరిగిన చివరి భేటీలో వ్యాపారంపై దృష్టి పెట్టాలని తాను సూచించినట్లు చెప్పారు.
దేశంలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినప్పటికీ ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆయన రియల్ ఎస్టేట్, ఫిట్నెస్ రంగాల్లో వ్యాపారాలు నిర్వహించారు. లక్నోలో ‘ది ఫిట్నెస్ ప్లానెట్’ పేరుతో జిమ్ కూడా నడిపారు. అలాగే వీధి కుక్కల సంరక్షణ కోసం ‘జీవ్ ఆశ్రయ్’ అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రతీక్ మృతిపై సమాజ్ వాదీ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. పార్టీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ ఆయన మరణం బాధాకరమని పేర్కొంది. అఖిలేష్ యాదవ్ కూడా తన సోదరుడి మృతికి నివాళులు అర్పించారు. ఇక ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు రాజకీయ నాయకులు ప్రతీక్ యాదవ్ మృతిపై సంతాపం తెలిపారు.
