మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పై దాడితో పాటు, పాలవాయి గేట్ లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజులు కస్టడీకి కోరారు పోలీసులు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు చొప్పున, రెండు రోజుల పాటు పోలీసులు విచారణ చేసేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిన్నెల్లిని నెల్లూరు జైల్లో సీసీ కెమెరాలు, పిన్నెల్లి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఓ డీఎస్పీ స్థాయి అధికారి, ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయవచ్చని అనుమతినిచ్చింది న్యాయస్థానం.
Read Also: Heavy rainfall warning: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు.. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి.. ఈవీఎం ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.
Read Also: Eye infections: వర్షాకాలంలో కంటి సంరక్షణ అవసరం.. ఈ చిట్కాలు పాటించండి