Air India Flight: ఎయిరిండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. నిందితుడు అరెస్ట్

Air India Flight

Air India Flight

Air India Flight Urination Incident: విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్​ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. తోటి ప్రయాణికులు అతడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది.. దిల్లీ ఎయిర్​పోర్టు అధికారులకు సమాచారం అందించారు.ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరగడంతో నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫ్లైట్ కెప్టెన్ తరపున ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు రామ్ సింగ్ అని చెప్పారు.

నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్​ స్టేషన్​కు తరలించారు. విచారణలో నిందితుడు ఆఫ్రికాలో కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన జూన్​ 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఎయిర్​ ఇండియా సిబ్బంది ఫిర్యాదు చేయడం వల్ల నిందితుడిని అరెస్టు చేశాం. అనంతరం కోర్టులో హాజరు పరిచాం. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ జరుగుతోంది’ పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. రామ్ సింగ్ అనే ప్రయాణికుడు విమానంలో మూత్ర విసర్జన చేసి ఆపై ఉమ్మివేసాడు. ఈ సమయంలో సిబ్బంది ప్రయాణికుడికి మౌఖిక వార్నింగ్ ఇచ్చారని, అయినప్పటికీ అతను ఆగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also Read: Uttar Pradesh: బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్..

సమాచారం ప్రకారం.. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఎయిర్ ఇండియా విమానం AIC 866 ముంబై- ఢిల్లీ విమానంలో ప్రయాణించాడు. ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఫ్లైట్ కెప్టెన్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు సెక్షన్ 294/510 కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Also Read: Mamata Benerjee: మమతా బెనర్జీకి తప్పిన ప్రమాదం.. ఉత్తర బెంగాల్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

విమానంలో ఇలా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఏప్రిల్​లో అమెరికన్​ ఎయిర్​ లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ఇలాంటి ఘటన జరిగింది. అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు.. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు సమాచారం అందించారు. అనంతరం నిందితుడిని సెక్యూరిటీ సిబ్బంది​ అదుపులోకి తీసుకుని.. పోలీస్​ స్టేషన్​ తరలించారు. గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్​ సీటులో కూర్చున్న ఓ వృద్ధురాలిపై శంకర్​ మిశ్రా అనే ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటనను తీవ్రంగా ఆక్షేపిస్తూ బాధితురాలు టాటా గ్రూప్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దూమారం రేపింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎయిర్ఇండియాను ఆదేశించింది. ఈ ఘటనలో ఎయిర్ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. దీంతో పాటు ఆ విమాన పైలట్​ లైసెన్సును 3 నెలలపాటు సస్పెండ్ చేసింది. తన విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను ఎయిర్​ ఇండియా ఇన్​ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్‌కు డీజీసీఏ రూ.3లక్షల జరిమానా విధించింది.