బీహార్లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది.
పార్లమెంట్ కాంప్లెక్స్లో రామ్ ఆలయ విరాళాల చోరీకి సంబంధించిన స్కిట్ చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. ఎంపీ నివాసంలో ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ఒక అపరిచిత వ్యక్తి పప్పు యాదవ్పైకి షూ విసరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ వెంటనే, ముందే అక్కడ వేచి ఉన్న ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కత్తితో ఆయనపై దాడికి యత్నించారు.
ఈ ఆకస్మిక దాడితో అప్రమత్తమైన పప్పు యాదవ్ అనుచరులు, భద్రతా సిబ్బంది వెంటనే దుండగులను అడ్డుకుని పట్టుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరిని ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్కు చెందిన సుమిత్గా గుర్తించారు.
ఈ ఘటన అనంతరం ఎంపీ పప్పు యాదవ్ స్పందిస్తూ.. తనను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. “ఇలాంటి పిరికిపంద దాడులకు నేను ఎంతమాత్రం భయపడను. ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగేది లేదు. ఎవరైనా నన్ను చంపాలనుకుంటే నిరభ్యంతరంగా చంపనివ్వండి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఆయనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వంటి పలువురు గ్యాంగ్స్టర్ల నుంచి ప్రాణహాని బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర రాజధానిలో ఎంపీ నివాసంలోనే ఇలాంటి ఘోరం జరగడం తీవ్ర భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.

