Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..

Metro

Metro

హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైల్ విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అండ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా దారుల్ షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మెట్రో రైల్ చీఫ్ ఇంజినీర్ ఎస్. భాస్కర్ రెడ్డితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభావితమవుతున్న మొత్తం 888 ఆస్తులలో ఇప్పటికే 833 ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన 55 ఆస్తులలో ఉన్న పురాతన భవనాలు, వారసత్వ కట్టడాలకు ఎలాంటి హాని కలగకుండా మెట్రో మార్గాన్ని విస్తరించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. అనేక ప్రతిబంధకాల మధ్య భూసేకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన రెవెన్యూ అధికారుల కృషిని అజిత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటర్ వర్క్స్ పైపులు తదితర యుటిలిటీలను సురక్షితంగా, వేగంగా వేరే ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే భూసేకరణ పూర్తయిన ఆస్తులను త్వరితగతిన తొలగించి, పనులు చేపట్టడానికి అనువుగా రైట్ ఆఫ్ వే (ROW) సాధించేలా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఓల్డ్ సిటీలో మెట్రో రైలు రాక పట్ల స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, పనుల పురోగతికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి మెట్రో ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.