NTV Telugu Site icon

Off The Record : AP Secretariatలో కోవర్ట్ ప్రకంపనలు

Ycp Otr

Ycp Otr

ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియెట్‌లో కోవర్ట్‌ ఆపరేషన్‌ జరుగుతోందా? లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మందికంటే ముందే వైసీపీకి తెలిసిపోతోందా? టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా? రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో ఏం జరుగుతోంది? ఏయే విభాగాల్లో వైసీపీ అనుకూలురు ఉన్నట్టు? ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు కోవర్ట్‌ ప్రకంపనలు రేగుతున్నాయి. వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు విచారణలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇంకా తెర మీదకు రాని అంశాలు ఏమైనా ఉన్నాయా..? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే అందరి దృష్టి సెక్రటేరియెట్‌ వైపునకు మళ్ళుతోందట. సచివాలయంలో తమ భక్తులను వైసీపీ జాగ్రత్తగా ప్లాంట్ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న చర్చ ప్రభుత్వ వర్గాలకు కునుకుపట్టనివ్వడం లేదని అంటున్నారు. చాలా విభాగాల్లో సెక్షన్ ఆఫీసర్లు మొదలుకుని.. ఆ పైస్థాయి వరకు వివిధ హోదాల్లో పాత ప్రభుత్వంలో పని చేసిన వారు ఇప్పటికీ అలాగే ఉన్నారని, అదే ఫోకల్ పోస్టింగుల్లో కొనసాగుతున్నారనే చర్చ జోరుగా ఉంది సచివాలయ వర్గాల్లో. ఫైనాన్స్, జీఏడీ, మున్సిపల్ అడ్మిన్, విద్యా శాఖ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్యం ఇలా వివిధ విభాగాల్లోని కీలక స్థానాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల వైసీపీ అనుకూలురు ఉన్నారని అంటున్నారు. ఆయా శాఖలకు సంబంధించి ఎలాంటి కీలక పరిణామాలు జరిగినా.. వాళ్ళు చిటికెలో వైసీపీకి సమాచారం చేరవేస్తున్నారన్న టాక్‌ బలంగా నడుస్తోంది. వీళ్ళద్వారా ప్రభుత్వంలోని చాలా మంది ముఖ్యులకంటే ముందుగా వైసీపీ హెడ్‌ క్వార్టర్స్‌కే సమాచారం చేరిపోతోందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. దానివల్ల ఏదో అయిపోతుందని కాకున్నా.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాడే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలి నాళ్లల్లోనే ఉద్యోగులు వ్యతిరేకించే జీపీఎస్ జీవో.. గెజిట్ అప్లోడ్ వంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయి. దాని వెనుక కుట్ర ఉందని తెలిసినా.. ఇప్పటి వరకు చర్యలూ లేవన్న అసహనం టీడీపీ అనుకూల వర్గాల్లో ఉంది. సాంకేతికంగా సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడం కుదరకున్నా.. వారిని అక్కడి నుంచి పక్కకు తప్పించారా.. అంటే… అది కూడా లేదనే సమాధానమే వస్తోందట. ఇలాగే ఉంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇక అక్కడ ఇక్కడ అని కాకుండా.. ఏకంగా సీఎం ఉండే ఫస్ట్ బ్లాక్ నుంచే కొన్ని విషయాలు బయటకు వచ్చేసిన సంఘటనలూ ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ వ్యక్తి సీఎం చంద్రబాబును కలవడానికి వస్తే.. ఆ విషయం ఫస్ట్ బ్లాకులో ఉన్న వారికంటే ముందుగానే సోషల్ మీడియాలో వచ్చేసింది. దీన్ని చూసి ఫస్ట్ బ్లాకులో ఉండేవారే కంగుతిన్నారట. ఇక మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల పేషీల్లోనూ కొందరు గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లు చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెయిటింగులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అత్యంత సమీప బంధువు ఓ కీలక మంత్రి పేషీలో ఉన్నట్టు సమాచారం.

టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేశారనే అభియోగాలు ఉన్న కొల్లి రఘురామిరెడ్డి బంధువులు ఏకంగా అత్యంత కీలకమైన శాఖ మంత్రి వద్దకు చేరడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయట సచివాలయ వర్గాలు. అయితే.. ఆ ఐపీఎస్‌తో బంధుత్వం ఉన్నంత మాత్రాన అనుమానించాల్సిన అవసరం లేదుగానీ…. కానీ సదరు వ్యక్తి కదలికలు.. చేస్తున్న పనులే అనుమానాస్పదంగా ఉన్నాయంటున్నారు కొందరు. స్వయంగా ఆ అధికారి కీలక మంత్రి పేషీలో తిష్టవేయడమే కాకుండా.. తనకు పరిచయం ఉన్న వాళ్లని వివిధ మంత్రులు లేదా.. కీలక అధికారుల పేషీల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పుడిదే సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. ఇలా వివిధ శాఖల్లో సెక్షన్ ఆఫీసర్లుగానూ.. వివిధ మంత్రులు.. కీలక అధికారుల పేషీల్లోనూ వైసీపీ తమకు అనుకూలమైన వారిని ప్లాంట్ చేస్తోందన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట టీడీపీ శ్రేణులు. అలాగే ఇంకొంత మంది కీలక అధికారుల దగ్గర పని చేసే గన్‌మెన్‌ కూడా గతంలో మంత్రుల వద్ద పని చేసిన వారేనని తెలిసింది. ప్రభుత్వానికి, కీలక విచారణలకు సంబంధించి ఎక్కడైతే యాక్టివిటీ ఎక్కువగా జరుగుతుందో.. అలాంటి అధికారుల దగ్గర తమకు అనుకూలంగా ఉండే గన్‌మెన్‌ను వైసీపీ అనుకూల అధికారులు జొప్పిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక కీలక విచారణలు చేపట్టే ఓ ఉన్నతాధికారి చుట్టూ ఉన్న వారంతా…. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు సన్నిహితంగా ఉన్నవాళ్లేనని.. పీఎస్సార్ మనుషులే తన చుట్టూ ఉన్నారని సదరు అధికారి సైతం వాపోతున్నట్టు తెలిసింది. ఈ గన్‌మెన్‌ విషయంలో పకడ్బందీగా ప్రణాళిక రచించి.. ఆ ప్లాన్‌ను జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో పీఎస్సార్ సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోందట అధికార వర్గాల్లో. ఇతర కీలక అధికారుల వద్ద కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితే ఉందట. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సెక్రటేరీయేట్టులోనూ.. తమ మనుషులు ఉండేలా వైసీపీ వేసిన స్కెచ్‌ చూసి టీడీపీ వర్గాలకు మతి పోతోందట. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో బలపడుతోందని అంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లల్లోనే సెక్రటేరియెట్‌లోని
కీలక విభాగాల్లో పని చేస్తున్న 30 నుంచి 40 మందిని బదిలీ చేసిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సెక్రటేరియెట్‌లో వీలైనంత త్వరగా ప్రక్షాళన చేపట్టకుంటే కష్టాలు కోరితెచ్చుకున్నట్టేననే చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో.