Off The Record: ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి ఓ నియోజకవర్గంలో గట్టి పట్టుంటే… ఫలానా పార్టీకి అది కంచుకోట అనడం కామన్. ఆ కోణంలో… ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటే కాదు, అంతకు మించి. ఇక్కడ ఎన్నిక ఏదైనా గెలుపు తెలుగుదేశం పార్టీదే. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్క 2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మిగతా అన్ని ఎన్నికల్లో సైకిల్దే హవా. ఇచ్చాపురంలో ఖాతా తెరిచేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవలేదు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా… 2014 , 2019 , 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారాయన. పార్టీకి అంత బలం ఉన్నచోట ఇప్పుడు బెందాళం సరిగా వ్యవహరించడం లేదని, ఆయన తీరుతోనే బలహీనపడే ప్రమాదం ఉందని సొంత కేడరే మాట్లాడుకుంటోంది. స్వప్రయోజనాలు తప్ప పార్టీ ప్రయోజనాలు ఆయనకు ఏ మాత్రం పట్టడం లేదంటూ ఇంటర్నల్గా మండిపడుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. దశాబ్దాలుగా ఆయన వెంట నడుస్తున్నా… ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని, పదవులు లేకుండా, జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలా ఎన్నేళ్ళని తిరుగుతామంటూ పెదవి విరుస్తున్నారు స్థానిక సంస్థల నాయకులు.
అదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి వచ్చిన పోస్ట్లను కూడా ఉదహరిస్తున్నారు. ఆ పార్టీని గెలిపించకున్నా… నియోజకవర్గానికి మంచి మంచి పదవులు దక్కాయని, అప్పుడు లోకల్గా అభివృద్ధిని చూశామని, ఆ సంగతిని బెందాళం అశోక్ మర్చిపోతే ఎలాగంటూ మండిపడుతున్నారు తమ్ముళ్ళు. వైసీపీ హయాంలో ఇచ్చాపురం సెగ్మెంట్కు పట్టం కట్టింది. పార్టీ నేత పిరియా సాయిరాజ్ భార్య జయలక్ష్మికి జడ్పీ ఛైర్పర్సన్ పదవి దక్కింది. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును ఎమ్మెల్సీగా , రెడ్డికతో పాటు ఇతర సామాజికవర్గాల నాయకులను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్స్ చైర్మన్లుగా నియమించారు. గ్రూపు కొట్లాటలతో నియోజకవర్గ పార్టీ ఇబ్బంది పడుతున్నా… లోకల్ లీడర్స్కు పదవుల విషయంలో మంచి ప్రాధాన్యత దక్కింది. సరిగ్గా ఇదే ఇప్పుడు బెందాళం అశోక్కు నెగెటివ్ అవుతోంది. నియోజకవర్గ ప్రజలు ఆదరించకున్నా… ఇచ్చాపురం నేతల్ని ఆ స్థాయిలో పదవులు వరిస్తే… వరుసగా గెలిపిస్తున్నా మీరు ఎన్ని పోస్ట్లు ఇప్పించగలుగుతున్నారంటూ అశోక్ను నిలదీస్తున్నారు స్థానిక టీడీపీ నాయకులు. అలాగే మెల్లిగా పార్టీలో లుకలుకలు బయట పడుతున్నాయట. వరుసగా గెలుస్తున్న బెందాళం అశోక్… తమను ఎదగనీయడం లేదంటూ వాపోతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. అదే ఊపులో మూడుసార్లు గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చాపురం, సోంపేట, కవిటి , కంచిలి మండలాలు ఉండగా…. ఉద్దానం కిడ్నీ సమస్యలు ఇక్కడ అసలైన సవాల్. వీటి పరిష్కారం దిశగా వైసీపీ హయాంలో అడుగులు పడ్డాయి. డయాలసిస్ కేంద్రాల పెంపు, బాధితులకు 10వేల పింఛన్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 700 కోట్లతో ఉద్దానం త్రాగు నీటి ప్రాజెక్ట్ లాంటివి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వీటివల్ల నియోజకవర్గ అభివృద్ధితో పాటు ద్వితీయ శ్రేణి నేతలకు మంచి గుర్తింపు దక్కిందని, టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. మరి దశాబ్దాలుగా పార్టీని, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ను నమ్ముకుంటే… మాకేం ఒరిగిందన్నది ఇచ్చాపురం తమ్ముళ్ల క్వశ్చన్. ఇంటర్నల్ మీటింగ్స్లో లోకల్ లోకల్ తెలుగుదేశం నాయకులు ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారట. వైసీపీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కిందని, ఇప్పుడు మన ప్రభుత్వంలో మనకేం ఒరుగుతోందన్నది ఇచ్చాపురం టీడీపీ నాయకుల అంతర్మథనం. ఈ చర్చలు ఇప్పుడు గ్రామ స్థాయికి చేరడం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గుండెల్లో గుబులు రేపుతోందని అంటున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు గమనిస్తారా లేక ఇలాగే ఉంటూ… రేపు తన సీటు కిందికే నీళ్ళు తెచ్చుకుంటారా అన్నది ఆయనే తేల్చుకోవాలంటున్నార నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు.
