Off The Record: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యవహారశైలిపై జిల్లా పాలిటిక్స్లో గరం గరం చర్చలు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏకంగా సొంత టీడీపీ అధిష్టానాన్నే ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనక వేరే వ్యూహం ఉందా? లేక నిజంగానే మనసులో నుంచి వచ్చిన బాధా అంటూ భిన్న కోణాల్లో ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 40 వేలకు పైగా మెజారిటీతో జీడీ నెల్లూరు నుంచి గెలిచారు థామస్. అప్పట్లో ఈ సీటు కోసం చాలామంది పోటీపడ్డా…. స్వతహాగా డాక్టర్ అయిన థామస్ పొలిటికల్ ట్రీట్మెంట్ కూడా పక్కాగా చేస్తారని లెక్కలేసుకుని మరీ టిక్కెట్ ఇచ్చారట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కానీ… గెలిచాక ఎమ్మెల్యే తీరు మారిపోయిందన్నది లోకల్ తమ్ముళ్ళ మాట. అందుకు కారణాలను కూడా వాళ్ళే చెబుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలు థామస్ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని, వాళ్లవల్ల నియోజకవర్గంలో టీడీపీ నాశనమైపోతోందంటూ పళ్లు కొరుకుతున్నారు పాత టీడీపీ నాయకులు. వివిధ మండలాల్లో ఎవరికి వారే అన్నట్టుగా పార్టీ నేతలు, క్యాడర్ విడిపోవడానికి ఎమ్మెల్యే వ్యవహారమే కారణమని చెప్పుకుంటున్నారు.
థామస్ పేరు చెప్పుకొని ఆయన అనుచరులు ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారట. గతంలో మంత్రివర్గ విస్తరణ టాక్ నడిచినప్పుడు.. అనుచరుల మీద ఫైరైపోయి వాళ్లని కట్టడి చేసి ముందు జాగ్రత్తలు తీసుకున్నా… అది పెద్దగా వర్కౌట్ అవలేదని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో.. కానీ… తాజాగా మరో కొత్త అస్త్రంతో ముందుకు వచ్చి… దాన్ని ఏకంగా పార్టీ మీదే ప్రయోగిస్తుండటం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఎప్పుడో ఇచ్చిన ర్యాంకుల గురించి, ఏడాది క్రితం జరిగిన ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్ గురించి ఇప్పుడు మాట్లాడుతూ… తన అస్త్రాన్ని ఏకంగా పార్టీ అధిష్టానం మీదికే ఎక్కుపెట్టడం పొలిటికల్ కలకలం రేపుతోంది. శాసనసభ్యుల పనితీరుకు సంబంధించి ఇచ్చిన ర్యాంక్స్ తనను చివరి స్థానానికి నెట్టారని, కేవలం తాను దళితుడినన్న కారణంతోనే వెనక్కి నెట్టారంటూ బాంబ్ పేల్చారు థామస్. ఎస్సీ కాకుండా వేరే కులం ఎమ్మెల్యేనయి ఉంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదంటూ కొనసాగింపునిచ్చి కులాల తుట్టెను కదిపే ప్రయత్నం చేశారాయన. ఎస్సీలు గెలిపించేటప్పుడు కావాలి.. ఖర్చు పెట్టేటప్పుడు కావాలి.. కానీ అధికారంలోకి వస్తే మాత్రం తొక్కేయాలని చూడటం ఏంటి? వేరే కులాల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా అంటూ ఫైర్ అయ్యారు థామస్. మంచి ర్యాంక్ ఇవ్వాలంటూ 5 లక్షలు అడిగారని, ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్లే చివరి ర్యాంక్ ఇచ్చారంటూ…ఏకంగా సొంత ప్రభుత్వానికే డబుల్ డోస్ ఇచ్చేశారాయన.
అక్కడితో ఆగితే అదో లెక్క. ఇంకో అడుగు ముందుకేసి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా మళ్ళీ తెరమీదికి తీసుకువచ్చారు జీడీ నెల్లూరు శాసనసభ్యుడు. పథకం ప్రకారం ఆయన్ని ఇరికించి, ఇబ్బంది పెట్టి సస్పెండ్ చేయించారంటూ ఇంకో బాంబ్ వేసేశారు. ఈ వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు రకరకాల కోణాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇది కేవలం ర్యాంకుల గోల కాదని, ఎప్పుడో మూడు నెలల క్రితం ప్రకటించిన వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నది కొందరి క్వశ్చన్. ఎమ్మెల్యేకి నిజంగానే ఆ ర్యాంక్స్ మీద అభ్యంతరాలుంటే అప్పుడే బయటపడేవారని, మూడు నెలల తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దాని వెనక వ్యూహం వేరే ఉండవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అటు ఆదిమూలం ఇష్యూ జరిగి కూడా ఏడాది కావస్తోంది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న థామస్, ఇప్పుడు అకస్మాత్తుగా ఆ విషయాన్ని తెరపైకి తీసుకుని రావడం వెనక లెక్కలు వేరే ఉన్నాయన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి జీడీ నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్లో. దీని వెనుక వోవరాల్గా మంత్రి పదవి ఆశలున్నాయా అన్నది రాజకీయవర్గాల అనుమానం. త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తలు వస్తున్నందున టీడీపీ అధిష్టానం మీద వత్తిడి పెంచేందుకు ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా అస్త్రాలను బయటికి తీస్తుండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో కూడా విస్తరణ వార్తలు వచ్చినప్పుడు నియోజకవర్గంలో తన అనుచరులను కట్టడి చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు. కుల వివక్ష పేరుతో పార్టీ మీద వత్తిడి తెచ్చే ప్లాన్ ఉండవచ్చన్నది టీడీపీలోనే వినిపిస్తున్న మరో వాయిస్. ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతున్న నాయకులు కొందరు సొంత అజెండాతో పార్టీ మీద బురద చల్లడం ఏంటంటూ మండిపడుతున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే కానీ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కానీ వ్యక్తిగతంగా చేసిన తప్పులకు పార్టీల నుంచి సస్పెండ్ అయ్యారే తప్ప…ఎక్కడా వివక్షతో చర్యలు తీసుకోలేదని అంటున్నారు. మొత్తానికి థామస్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి ఈ ‘ప్రెజర్ పాలిటిక్స్’ ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెడతాయా? లేక అధిష్టానం ఆగ్రహానికి గురి చేస్తాయా? అన్నది వేచి చూడాలి.
