నిర్మల్ పట్టణంలో ప్రముఖ శిశువైద్యుడు డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ‘నిర్మల్ బంద్’ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు సంబంధించి ప్రధాన వివరాలు ఇలా ఉన్నాయి. ఫార్మసీ కౌన్సిల్ స్టేట్ డైరెక్టర్ , నిర్మల్ జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్ ఈ బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే వైద్యులపై ఇటువంటి దాడులు జరగడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా.. మానవతా దృక్పథంతో నిర్మల్ ప్రజలందరూ ఈ బంద్ కు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్లపై దాడులను సమాజంలోని అన్ని వర్గాలు ఏకగ్రీవంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం..
నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిర్మల్ ప్రాంతంలో వరుసగా జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఘటనలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం పట్టణ బంద్ కు పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన వారిని ప్రశ్నిస్తూ.. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్య వృత్తికి భద్రత కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు కోరారు.
